చెన్నై: పన్నీర్ సెల్వం (ఓపీఎస్)కు ఊరట లభించింది. ఆయనకు అనుకూలంగా మద్రాస్ హైకోర్టు బుధవారం తీర్పు ఇచ్చింది. జూన్ 23 నాటి యధాతథ స్థితిని కొనసాగించాలని తెలిపింది. కోఆర్డినేటర్, జాయింట్ కోఆర్డినేటర్ ఇద్దరి అనుమతి లేకుండా అన్నాడీఎంకే సాధారణ కౌన్సిల్ సమావేశం నిర్వహించడాన్ని తప్పుపట్టింది. ఏఐఏడీఎంకే జనరల్ కౌన్సిల్ సమావేశాన్ని తిరిగి నిర్వహించాలని న్యాయమూర్తి జి జయచంద్రన్ ఆదేశించారు.
కాగా, తొలుత న్యాయమూర్తి కృష్ణన్ రామసామి ఈ కేసుపై విచారణ జరిపారు. అయితే జడ్జీని మార్చాలని ఓపీఎస్ తరుఫు న్యాయవాది కోరారు. దీనిపై ఓపీఎస్కు కోర్టు చీవాట్లు పెట్టింది. న్యాయవ్యవస్థపై నమ్మకం లేకపోవడంపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో ఓపీఎస్ బృందం క్షమాపణ చెప్పింది. ఈ నేపథ్యంలో గత వారం న్యాయమూర్తి జి జయచంద్రన్ ఇరు పార్టీల వాదనలు విన్నారు. రిజర్వ్ చేసిన తీర్పును బుధవారం వెల్లడించారు.
అన్నాడీఎంకే అధినేత్రి, మాజీ సీఎం జయలలిత మరణాంతరం పార్టీని నడిపేందుకు ఎడప్పాడి కె పళనిస్వామి (ఈపీఎస్) కోఆర్డినేటర్గా, ఓ పన్నీర్ సెల్వం (ఓపీఎస్) జాయింట్ కోఆర్డినేటర్ గా నియమితులయ్యారు. అయితే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే ఓటమి అనంతరం ఇరువురు మధ్య విభేదాలు తలెత్తాయి. పార్టీకి వ్యతిరేకంగా, డీఎంకేకు మద్దతుగా ఓపీఎస్ వ్యవహరిస్తున్నారని ఈపీఎస్ వర్గం ఆరోపించింది.
ఈ నేపథ్యంలో జూలై 11న జరిగిన ఏఐఏడీఎంకే సాధారణ కౌన్సిల్ సమావేశంలో ఈపీఎస్, ఓపీఎస్ పదవులను రద్దు చేశారు. ఈపీఎస్ను తాత్కాలిక కార్యదర్శిగా నియమించడంతోపాటు ఓపీఎస్ను పార్టీ నుంచి బహిష్కరించారు. దీంతో మద్రాస్ హైకోర్టును ఓపీఎస్ ఆశ్రయించారు. జూన్ 23 నాటి యధాతథ స్థితిని కొనసాగించాలని ఆయన కోరగా దీనికి కోర్టు అంగీకరించింది. ఏఐఏడీఎంకే జనరల్ కౌన్సిల్ సమావేశాన్ని తిరిగి నిర్వహించాలని ఆదేశించింది.