సుమారు రూ.33 కోట్ల విలువ కలిగిన ప్రభుత్వ హెలికాప్టర్ను అత్యంత చవకగా ఒక స్క్రాప్ డీలర్కు అమ్మేసింది మధ్యప్రదేశ్ ప్రభుత్వం.బెల్ 430 వీటీ ఎంపీఎస్ మోడల్ హెలికాప్టర్ను 1998లో మధ్యప్రదేశ్ ప్రభుత్వం కొనుగోలు చేసింది. రాష్ట్ర ఏవియేషన్ విభాగం దీన్ని అమ్మేందుకు గత పది సంవత్సరాలుగా ప్రయత్నాలు చేస్తోంది.
ఏడుసార్లు వేలంపాటలో దీన్ని ఉంచినా ఎవరూ కొనుగోలు చేయలేదు. 2003లో ప్రముఖ సింగర్ అనురాధ పౌడ్వల్, అప్పటి సీఎం దిగ్విజయ్ సింగ్ పర్సనల్ అసిస్టెంట్ రాజేంద్ర సింగ్ రఘువన్షీ ఈ హెలికాప్టర్లో వెళ్తుండగా.. దీనికి యాక్సిడెంట్ జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరికీ గాయాలయ్యాయి.
అయితే ఈ హెలికాప్టర్కు ఇన్సూరెన్స్ లేని కారణంగా ప్రభుత్వానికి ఎలాంటి క్లెయిమ్ లభించలేదు. ఆ తర్వాత 2012లో దీనికి మరమ్మతులు చేయించారు. అయితే ఈ హెలికాప్టర్ మ్యానుఫాక్చరర్ రోల్స్ రాయిస్ కంపెనీ.. దీని స్పేర్ పార్ట్ల తయారీని నిలిపివేయడంతో హెలికాప్టర్ను అమ్మకానికి పెట్టారు.
తాజాగా దీన్ని రూ.2.24 కోట్లకు ఎఫ్ఏ ఎంటర్ప్రైజెస్ కొనుగోలు చేసినట్లు సమాచారం. ఈ కంపెనీ యజమాని నయీమ్ రజా మాట్లాడుతూ.. దీన్ని రిపేర్ చేసి త్వరలోనే మళ్లీ ఉపయోగిస్తామని తెలిపారు.