బుర్హాన్పూర్: సాధారణంగా ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి నామినేషన్ వేసేందుకు కార్లలోనో, ట్రాక్టర్లలోనో, బైకులపైనో అనుచరులతో కలిసి ర్యాలీగా వెళ్తారు. లేదంటే పెట్రో ధరలపై నిరసన తెలుపుతూ ఎద్దుల బండ్లపై వెళ్లి నామినేషన్లు వేస్తారు. అదీ కాకపోతే నడుచుకుంటూ వెళ్లి నామినేషన్లు వేసి వస్తారు. కానీ, మధ్యప్రదేశ్ రాష్ట్రం బుర్హాన్పూర్ జిల్లాలోని బుర్హాన్పూర్ నియోజక వర్గ స్వతంత్ర అభ్యర్థి ప్రియాంక్ సింగ్ థాకూర్ ఏకంగా గాడిదపై వెళ్లి రిటర్నింగ్ అధికారికి తన నామినేషన్ పత్రాలను సమర్పించారు.
రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను సమర్పించిన అనంతరం ప్రియాంక్ సింగ్ మాట్లాడుతూ.. దేశంలో వంశ పారంపర్య రాజకీయాలకు వ్యతిరేకంగా తాను ఇలా చేశానని చెప్పారు. దేశంలో ఎక్కడ చూసినా ఎక్కువగా కొన్ని కుటుంబాల్లోని తాతలు, తండ్రులు, మనుమలు మాత్రమే ప్రజాప్రతినిధులుగా ఎన్నికవుతూ వస్తున్నారని, ప్రజాస్వామ్య దేశంలో ఇది మంచి సంప్రదాయం కాదని అన్నారు.
చాలా ప్రాంతాల్లో అధికారం ఎప్పటికీ ఒకే కుటుంబం చేతిలో ఉంటుందోని, ఆ అధికారంతో ఆ ప్రాంత ప్రజలను ఆ కుటుంబం గాడిదలను చేసి వాడుకుంటోందని ప్రియాంక్ సింగ్ మండిపడ్డారు. అందుకే వంశ పారంపర్య రాజకీయాలపై తన వ్యతిరేకతను చాటి చెప్పేందుకు ఇలా గాడిదపై వచ్చి నామినేషన్ వేశానని అన్నారు. కాగా ప్రియాంక్ సింగ్ గాడిదపై వెళ్లి నామినేషన్ వేసిన ఘటనకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.