భోపాల్: పశువులు వీధుల్లో స్వేచ్ఛగా సంచరిస్తే వాటి యజమానికి శిక్ష విధించేలా ఒక గ్రామ సర్పంచ్ నిర్ణయించారు. యజమాని చెంపపై ఐదు చెప్పు దెబ్బలు కొట్టడంతోపాటు రూ.500 జరిమానా విధించాలని తీర్మానం చేశారు. దీంతో ఆ గ్రామానికి చెందిన సిబ్బంది డప్పు కొట్టి ఈ విషయాన్ని గ్రామస్తులకు తెలియజేస్తున్నారు. అయితే ఈ వింత రూలు (bizarre rule)పై గ్రామస్తులు మండిపడుతున్నారు. బీజేపీ పాలిత మధ్యప్రదేశ్లో ఈ సంఘటన జరిగింది.
శాహ్దోల్ జిల్లాలోని నాగనదుయ్ గ్రామ సర్పంచ్ ఇటీవల కొత్త నిబంధన చేశారు. గ్రామంలో పశువులు స్వేచ్ఛగా తిరిగితే వాటి యాజమానులను శిక్షించేలా తీర్మానం చేశారు. చెప్పుతో చెంపపై ఐదుసార్లు కొట్టడంతోపాటు రూ.500 జరిమానా విధిస్తామని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో సర్పంచ్ కార్యాలయం సిబ్బంది ఇంటింటికీ వెళ్లి డప్పు కొట్టి ఈ కొత్త రూలు గురించి ప్రజలకు తెలియజేస్తున్నారు.
కాగా, ఈ కొత్త రూలుపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నిబంధనను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కొందరు గ్రామస్తులు దీనిని వ్యతిరేకిస్తూ నిరసనలు చేపట్టారు. మరి కొందరు గ్రామస్తులు ఈ కొత్త నిబంధన గురించి ప్రభుత్వ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ వింత రూలుపై జోక్యం చేసుకోవాలని సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ (ఎస్డీఎం)ను కోరారు.