భోపాల్: మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. 12 ఏళ్లలోపు పిల్లలు ఉన్న తల్లిదండ్రులకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించింది. మూడో వేవ్లో కరోనా పిల్లలపై ఎక్కువ ప్రభావం చూపనుందన్న వార్తల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ముఖ్యమంత్రి శివరాజ్సింగ్ చౌహాన్ వెల్లడించారు. దీనివల్ల వారి పిల్లలకు వైరస్ సోకినా.. ఆ తల్లిదండ్రులు వారిని జాగ్రత్తగా చూసుకునే వీలు కలుగుందని ఆయన చెప్పారు.
ఇప్పటికే రాష్ట్రంలో సెకండ్ వేవ్ను కట్టడి చేసినా.. మూడో వేవ్ వస్తుందన్న ఆందోళన ఉన్నదని శివరాజ్ అన్నారు. అందుకే పిల్లల కోసం ప్రత్యేకంగా వార్డులు ఏర్పాటు చేసి, ఆరోగ్య సేవలను మెరుగు పరచినట్లు ఆయన తెలిపారు. ఇక విదేశాలకు వెళ్లే విద్యార్థులకు కూడా వ్యాక్సిన్ను ప్రాధాన్యతా క్రమంలో ఇవ్వనున్నట్లు చెప్పారు.