భోపాల్: పెళ్లి చేసుకుంటానని నమ్మించిన డిప్యూటీ కలెక్టర్ ఒక మహిళను లొంగదీసుకుని పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత ఆమెను పెళ్లి చేసుకునేందుకు నిరాకరించాడు. బాధిత మహిళ ఫిర్యాదు చేయడంతో ఆ డిప్యూటీ కలెక్టర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. (Deputy Collector Arrested) మధ్యప్రదేశ్లోని మొరేనా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. డిప్యూటీ కలెక్టర్ అరవింద్ మహోర్పై 32 ఏళ్ల మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. 2025లో సబల్గఢ్ సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ (ఎస్డీఎం)గా ఆయన పని చేసిన సమయంలో ఫేస్బుక్లో తనకు పరిచయమైనట్లు తెలిపింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి తనను లోబర్చుకుని కొన్ని నెలల పాటు లైంగికంగా వాడుకున్నాడని ఆరోపించింది. తనను పెళ్లి చేసుకోమని కోరగా నిరాకరించడంతో పాటు రూ.5 కోట్లు, ఇతర డిమాండ్లు చేశాడని, బెదిరింపులకు పాల్పడినట్ల ఫిర్యాదులో పేర్కొంది.
కాగా, బాధిత మహిళ ఫిర్యాదుపై సివిల్ లైన్స్ పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. డిప్యూటీ కలెక్టర్ అరవింద్ మహోర్ను జూన్ 4న అరెస్ట్ చేశారు. మొబైల్ ఫోన్ రికార్డులు, ఎలక్ట్రానిక్ పరికరాలు, వీడియోలు, ఇతర డిజిటల్ సాక్ష్యాలను పోలీసులు పరిశీలిస్తున్నారు.
మరోవైపు డిప్యూటీ కలెక్టర్ అరవింద్ మహోర్ను అరెస్ట్ చేసిన కొన్ని గంటల్లోనే చంబల్ కమిషనర్ సురేష్ కుమార్ ఆయనను సస్పెండ్ చేశారు. అయితే అరవింద్ మహోర్ గతంలో ఒక విద్యార్థిని పట్ల అనుచితంగా ప్రవర్తించినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆయనపై చర్యలు చేపట్టాలని సీఎం మోహన్ యాదవ్ అధికారులను ఆదేశించారు. విద్యార్థినిపై దుష్ప్రవర్తన ఆరోపణలపై విచారణ ఇంకా కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు.