భోపాల్ : మధ్యప్రదేశ్ నూతన సీఎంగా ఉజ్జయిని సౌత్ ఎమ్మెల్యే మోహన్ యాదవ్ను (Mohan Yadav) బీజేపీ అనూహ్యంగా తెరపైకి తీసుకువచ్చింది. తనకు అప్పగించిన బాధ్యతలను నెరవేర్చేందుకు కృషి చేస్తానని, తనకు కీలక బాధ్యతలు కట్టబెట్టిన రాష్ట్ర, కేంద్ర నాయకత్వాలకు మోహన్ యాదవ్ కృతజ్ఞతలు తెలిపారు.
తాను పార్టీలో చిన్న కార్యకర్తనని, మీ ప్రేమాభిమానాలతో పార్టీ రాష్ట్ర, కేంద్ర నాయకత్వం అప్పగించిన బాధ్యతలను మీ ప్రేమ, ఆశీస్సులతో నెరవేర్చేందుకు తన ప్రభుత్వం శాయశక్తులా ప్రయత్నిస్తుందని పేర్కొన్నారు. శివరాజ్ సింగ్ చౌహాన్ సారధ్యంలోని గత ప్రభుత్వంలో మంత్రిగా వ్యవహరించిన మోహన్ యాదవ్ను కాషాయ పార్టీ అత్యున్నత పదవికి ఎంపిక చేసింది.
ఇక జగదీష్ దేవ్డా, రాజేష్ శుక్లాలను డిప్యూటీ సీఎంలుగా ఎంపిక చేసింది. మాజీ కేంద్ర మంత్రి నరేంద్ర తోమర్ మధ్యప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్గా బాధ్యతలు చేపట్టనున్నారు. ఇక మోహన్ యాదవ్ ఉజ్జయిని దక్షిణ్ నుంచి 2013లో తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. ఇక 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన మరోసారి ఉజ్జయిని దక్షిణ్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇక 2020 జులైలో ఆయన శివరాజ్ చౌహాన్ కేబినెట్లో మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. కాగా, సోమవారం ఉదయం బీజేపీ కేంద్ర పరిశీలకులు మనోహర్ లాల్ ఖట్టర్, డాక్టర్ కే లక్ష్మణ్, ఆశా లక్రాల సమక్షంలో జరిగిన బీజేఎల్పీ సమావేశం జరిగింది.
Read More :