బెంగళూరు, ఫిబ్రవరి 21: అంతరిక్షంలోకి మనుషులను పంపేందుకు ఇస్రో మరో ముందడుగు వేసింది. గగన్యాన్ మిషన్లో వినియోగించే ఎల్వీఎం-3 లాంచ్ వెహికల్ సీఈ20 క్రయోజెనిక్ ఇంజిన్ రెడీ అయ్యిందని ప్రకటించింది. ‘ఎల్వీఎం-3 రాకెట్కు శక్తినిచ్చే సీఈ20 క్రయోజెనిక్ ఇంజిన్ హ్యూమన్ రేటింగ్లో ప్రధాన మైలురాయిని సాధించింది’ అని పేర్కొన్నది. ఈ ఇంజిన్ సామర్థ్యాన్ని పరీక్షించేందుకు అనేక భద్రత చర్యలు తీసుకున్నట్టు వెల్లడించింది. ఈ నెల 13న చివరి దశ ప్రమాణ పరీక్షలు పూర్తయ్యాయని వివరించింది. గగన్యాన్లో మిషన్లో భాగంగా ఇస్రో ముగ్గురు వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపనున్నది. దాదాపు 400 కిలోమీటర్ల ఎత్తయిన కక్ష్యలోకి చేర్చి, తిరిగి భూమిపైకి తీసుకురావాలని నిర్ణయించింది. మూడు రోజుల పాటు జరగనున్న ఈ ప్రయోగంలో.. వ్యోమగాములు తిరుగు ప్రయాణంలో సముద్రంపై దిగుతారు. రాకెట్ ఇంజిన్లలో హ్యూమన్ రేటింగ్ వ్యవస్థ కీలకం. మానవులు సురక్షితంగా ప్రయాణించేందుకు యంత్రాలు ఏ మేరకు సరిపోతాయని ఈ వ్యవస్థ అంచనా వేస్తుంది. 2025లో ఈ మిషన్ను చేపట్టే లక్ష్యంతో ఇస్రో చర్యలు ముమ్మరం చేసింది. ఈ మిషన్ విజయవంతమైతే అమెరికా, చైనా, సోవియట్ యూనియన్ తర్వాత ఈ ఘనత సాధించిన నాలుగోదేశంగా భారత్ నిలుస్తుంది. ఈ మిషన్ను 2025లో చేపట్టాలని భావిస్తున్నది. వాస్తవానికి 2022లోనే పాజెక్టు చేపట్టాల్సి ఉండగా.. కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది.