లక్నో, జూన్ 8: 16 ఏండ్ల బాలుడు. పబ్జీ గేమ్కు బానిసయ్యాడు. ఆట వద్దురా అని తల్లి ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోలేదు. దీంతో ఓ సారి గట్టిగా మందలించింది. తీవ్ర కోపం తెచ్చుకున్న అతడు తల్లిని తుపాకీతో కాల్చిచంపాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లో శనివారం చోటుచేసుకుంది. చంపిన తర్వాత శవాన్ని ఇంట్లోని ఓ గదిలో ఉంచి తాళం వేశాడు. ఘటన గురించి ఎవరికీ చెప్పవద్దంటూ తన చెల్లిని బెదిరించాడు.
రెండు రోజుల తర్వాత శవం కుళ్లిన వాసన రావడంతో ఎవరికీ అనుమానం రాకుండా స్ప్రే చేశాడు. అయినా వాసన బాగా వస్తుండటంతో పశ్చిమబెంగాల్లో పనిచేస్తున్న తన తండ్రి (సైన్యంలో జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్)కి ఫోన్ చేశాడు. ఏదో కట్టుకథ అల్లి తల్లిని ఓ వ్యక్తి హత్య చేసినట్టు సమాచారమిచ్చాడు. దీంతో తండ్రి తన ఇంటి పక్కవాళ్లకు ఫోన్ చేసి విషయం చెప్పాడు. వెంటనే ఇంటిపక్కలవాళ్లు పోలీసులకు సమాచారమివ్వడంతో వాళ్లు ఘటనాస్థలానికి చేరుకున్నారు. ఏం జరిగిందని బాలుడిని ఆరా తీయగా తండ్రికి చెప్పిన కట్టుకథనే పోలీసులకు చెప్పాడు. దీంతో అనుమానం వచ్చిన పోలీసులు బాలుడిని అదుపులోకి తీసుకొని విచారించగా అసలు విషయం బయటపడింది. పబ్ జీ గేమ్ ఆడనివ్వనందుకు తండ్రి తుపాకీతో తల్లిని బాలుడు కాల్చిచంపినట్టు పోలీసులు నిర్ధారించారు.