న్యూఢిల్లీ: భారత ఆర్మీ చీఫ్గా లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ పాండే నియమితులయ్యారు. ఈ నెల 30న ఆ పదవీ కాలాన్ని పూర్తి చేయనున్న జనరల్ మనోజ్ ముకుంద్ నరవాణె స్థానాన్ని ఆయన భర్తీ చేయనున్నారు. కాగా, ఆర్మీలో అత్యున్నత పదవిని తొలిసారి ఒక ఇంజినీర్ చేపట్టనుండటం విశేషం. లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ పాండే 1982లో కార్ప్స్ ఆఫ్ ఇంజినీర్స్లో నియమితులయ్యారు. 2001 డిసెంబర్ 13న పార్లమెంట్పై ఉగ్రదాడి తర్వాత సరిహద్దులోని నియంత్రణ రేఖ వెంబడి పల్లన్వాలా సెక్టార్లో నిర్వహించిన సాయుద్ధ దళాల అతిపెద్ద సైనిక విన్యాసమైన ఆపరేషన్ పరాక్రమ్లో ఇంజినీర్ రెజిమెంట్కు ఆయన నేతృత్వం వహించారు.
నాలుగు దశాబ్దాలుగా సైనిక వృత్తిలో ఉన్న లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ పాండే వెస్ట్రన్ థియేటర్ ఇంజినీర్ బ్రిగేడ్కు, ఎల్వోసీ వెంబడి పదాతిదళ బ్రిగేడ్కు కమాండర్గా ఉన్నారు. లడఖ్లోని పర్వత విభాగానికి, ఈశాన్య ప్రాంతంలోని ఒక కార్ప్స్కు కూడా నేతృత్వం వహించారు. అనంతరం అండమాన్, నికోబార్ కమాండ్కు కమాండర్ ఇన్ చీఫ్గా ఉన్నారు.
నేషనల్ డిఫెన్స్ అకాడమీ పూర్వ విద్యార్థి అయిన లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ పాండే ప్రస్తుతం కోల్కతాలోని ఈస్టర్న్ కమాండ్కు నాయకత్వం వహిస్తున్నారు. పదవీ విరమణ చేసిన లెఫ్టినెంట్ జనరల్ సీపీ మొహంతి స్థానంలో ఫిబ్రవరి 1న ఆర్మీ వైస్ చీఫ్గా బాధ్యతలు చేపట్టారు.