న్యూఢిల్లీ: గతంలో ఎప్పుడూ లేనంత ఉష్ణోగ్రత ఈ ఏడాది మార్చి నెలలో నమోదైనట్టు యూరోపియన్ యూనియన్ వాతావరణ సంస్థకు చెందిన కోపర్నికస్ ైక్లెమెట్ చేంజ్ సర్వీస్(సీ3ఎస్) మంగళవారం వెల్లడించింది. ఎల్ నినో పరిస్థితులు, మనుషుల వల్ల కలిగిన వాతావరణ మార్పుల వల్ల మార్చిలో ఉష్ణోగ్రతలు అత్యధికంగా నమోదైనట్టు తెలిపింది. 1850 – 1900 మధ్యకాలంలో సగటు మార్చి నెల ఉష్ణోగ్రతల కంటే ఈ ఏడాది మార్చిలో సగటు ఉష్ణోగ్రత 1.68 డిగ్రీలు అధికంగా నమోదైనట్టు వెల్లడించింది. 1991 – 2020 మధ్యకాలంలో మార్చి నెల సగటు ఉష్ణోగ్రతల కంటే 0.73 డిగ్రీలు ఎక్కువ ఉష్ణోగ్రత ఈ మార్చిలో నమోదైనట్టు తెలిపింది. ఇంతకుముందు 2016 మార్చిలో అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదు కాగా, ఈ మార్చిలో అంతకంటే సగటున 0.10 ఉష్ణోగ్రత ఎక్కువ నమోదైనట్టు పేర్కొన్నది. ఇక, ప్రపంచవ్యాప్తంగా గత 12 నెలల (ఏప్రిల్ 2023 నుంచి మార్చి 2024) ఉష్ణోగ్రతలు కూడా చరిత్రలోనే అత్యధికంగా నమోదైనట్టు ఈ సంస్థ వెల్లడించింది. 1850 – 1900 మధ్యకాలం కంటే 1.58 డిగ్రీలు, 1991 – 2020 మధ్యకాలం కంటే 0.70 డిగ్రీల సగటు అధిక ఉష్ణోగ్రత గత పన్నెండు నెలల్లో నమోదైనట్టు తెలిపింది