వారణాసి/బెంగళూరు, మే 16: ఉత్తరప్రదేశ్లో వారణాసిలోని జ్ఞాన్వాపీ మసీదు కాంప్లెక్స్లో సోమవారంతో వీడియోగ్రఫీ సర్వే పూర్తయింది. ఈ సందర్భంగా అక్కడ కీలక పరిణామం చోటుచేసుకున్నది. సర్వే చేస్తున్న సమయంలో ముస్లింలు నమాజ్ కోసం చేతులు, కాళ్లు శుభ్రం చేసుకునే ప్రాంతానికి సమీపంలో ఒక శివలింగం బయటి పడిందని హిందూ పిటిషనర్ల తరపు న్యాయవాదులు పేర్కొన్నారు. శివలింగానికి భద్రత కల్పించాలని కోరుతూ అడ్వకేట్లు మదన్ మోహన్ యాదవ్, హరీష్ శంకర్ జైన్ స్థానిక కోర్టును ఆశ్రయించారు.
దీనిపై స్పందించిన జడ్జి రవికుమార్ దివాకర్ శివలింగం బయటపడిన ప్రాంతాన్ని సీల్ చేయాలని, ఆ ప్రాంతానికి భద్రత కల్పించాలని వారణాసి జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్ను ఆదేశించారు. అయితే శివలింగం బయటపడిందన్న వాదనను మసీదు కమిటీ అధికార ప్రతినిధి తిరస్కరించారు. ఆ వస్తువు ఫౌంటెన్లో భాగమని, అయితే సీలింగ్ ఆదేశాలు ఇచ్చే ముందు కోర్టు తమ న్యాయవాదుల పూర్తి వాదనలు వినలేదని ఓ టీవీ చానెల్తో మాట్లాడుతూ అన్నారు. మరోవైపు కోర్టు ఆదేశాల మేరకు సర్వే పూర్తి చేసి నివేదిక సమర్పించామని, న్యాయస్థానం తదుపరి నిర్ణయం ఏంటనేది మంగళవారం తెలుస్తుందని కలెక్టర్ కౌశల్రాజ్ శర్మ పేర్కొన్నారు.
కర్ణాటకలోనూ జ్ఞాన్వాపీ తరహా వివాదం
జ్ఞాన్వాపీ కేసు ఓవైపు కొనసాగుతుండగానే.. కర్ణాటకలో ఓ హిందూత్వ సంస్థ అలాంటి వివాదాన్నే లేవనెత్తింది. శ్రీరంగపట్న పట్టణంలోని మసీదు స్థానంలో అంతకుముందు హనుమాన్ ఆలయం ఉండేదని, అక్కడ పూజలకు అనుమతించాలని ‘నరేంద్ర మోదీ విచ్చార్ మంచ్’ అనే రైట్వింగ్ గ్రూప్ మండ్య జిల్లా అధికారులను కోరింది. ఈ మేరకు మంచ్ రాష్ట్ర కార్యదర్శి సీటీ మంజునాథ్ నేతృత్వంలోని బృందం మండ్య జిల్లా డిప్యూటీ కమిషనర్కు వినతిపత్రం ఇచ్చింది.