న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో వాయుకాలుష్యం సుప్రీం కోర్టు బుధవారం విచారణ జరిపింది. కాలుష్యం కారణంగా ఢిల్లీలో నెలకొన్న ఆందోళనకర పరిస్థితులపై దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం విచారించింది. దేశ రాజధానిలో కాలుష్యం నియంత్రణకు ఎన్సీఆర్ పరిధిలోని రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వం మరికొన్ని రోజులు చర్యలు చేపట్టాలని సుప్రీం కోర్టు ఆదేశించింది.
కాలుష్య నివారణకు ముందస్తు చర్యలు అవసరమని అభిప్రాయపడింది. దేశ రాజధానికి సంబంధించి.. మనం ప్రపంచానికి ఎలాంటి సంకేతాలు పంపుతున్నామో చూడాలని సూచించింది. కాలుష్య నివారణకు చేపట్టే ముందస్తు చర్యలు శాస్త్రీయ విధానం మేరకు గణాంక విధానంలో ఉండాలని ధర్మాసనం పేర్కొన్నది. పారిశ్రామిక, థర్మల్ విద్యుత్ కేంద్రాలు, వాహనాలు, ధుమ్ము, డీజిల్ జనరేట్ల నుంచి వెలువడే కాలుష్యాన్ని నియంత్రించాలని సూచించింది. ఈ మేరకు కమిషన్ ఫర్ ఎయిర్ కాల్విటీ మేనేజ్మెంట్ సూచించినట్లు ధర్మాసనం గుర్తు చేసింది.
కేంద్రం తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా.. గాలి నాణ్యత మెరుగుపడుతుందని భావిస్తున్నట్లు తెలిపారు. ప్రజా రవాణాను ప్రోత్సహించేందుకు కేంద్ర ఉద్యోగులకు ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు పేర్కొన్నారు. మూడు రోజుల తర్వాత పరిస్థితిని సమీక్షిస్తామని కోర్టుకు తెలిపారు. ఈ సందర్భంగా మరో రెండు మూడు రోజులు కాలుష్య నియంత్రణ చర్యలు చేపట్టాలని కేంద్రాన్ని ఆదేశించింది. ఈ లోపు కాలుష్య స్థాయి తగ్గితే పలు నిబంధనలు సడలించవచ్చని సూచించిన సుప్రీం కోర్టు.. కేసును మాత్రం మూసివేయమని స్పష్టం చేసింది.
పంట వ్యర్థాల దహనం సమస్యను ఎలా పరిష్కరించబోతున్నారని ధర్మాసనం ప్రశ్నించింది. శాస్త్రవేత్తలతో కలిసి గ్రామాలకు వెళ్లి రైతులను కలిసి నిర్ణయాలు తీసుకోవాలని సూచించిన కోర్టు.. ఇలా ఎందుకు జరుగడం లేదని.. పంట వ్యర్థాల దహనంపై ఇన్ని సంవత్సరాలుగా ప్రధాన కార్యదర్శులు, అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించింది. వాయు కాలుష్యంపై సుప్రీం కోర్టులో వాదనలు జరుగడం వరుసగా ఇది మూడో వారం కాగా.. కేసు తదుపరి విచారణను ఈ నెల 29వ తేదీకి వాయిదా వేసింది.