న్యూఢిల్లీ: పార్లమెంట్ రెండో విడత బడ్జెట్ సమావేశాల్లో వరుసగా మూడు రోజుల నుంచి రచ్చ జరుగుతూనే ఉన్నది. అదానీ-హిండెన్బర్గ్ వ్యవహారంపై ప్రతిపక్షాల ఆందోళనలతో ఉభయసభలు దద్ధరిల్లుతున్నాయి. బుధవారం కూడా ఉదయం 11 గంటలకు పార్లమెంటు సమావేశాలు మొదలవగానే ఉభయసభల్లోని ప్రతిపక్ష ఎంపీలు ఆందోళనకు దిగారు.
అదానీ అంశంపై విచారణకు జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా నినాదాలు చేశారు. దాంతో అధికార బీజేపీ సభ్యులు కూడా ఎదురుదాడికి దిగారు. లండన్లో భారత దేశం పరువుతీసే వ్యాఖ్యలు చేసిన రాహుల్గాంధీ సభకు క్షమాపణలు చెప్పాలని పట్టుబట్టారు.
ఇలా అధికార, ప్రతిపక్షాల పోటాపోటీ ఆందోళనలతో గత మూడు రోజులుగా పార్లమెంట్ ఉభయసభల్లో వాయిదాల పర్వం కొనసాగుతున్నది. సభ సజావుగా సాగేందుకు సభ్యులు సహకరించాలని లోక్సభలో స్పీకర్, రాజ్యసభలో చైర్మన్ నచ్చజెప్పే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోవడంతో ఇవాళ ఉభయసభలు ముందుగా మధ్యాహ్నం 2 గంటల వరకు, ఆ తర్వాత గురువారం ఉదయం 11 గంటల వరకు వాయిదా పడ్డాయి.