న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో మళ్లీ లాక్డౌన్ విధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అక్కడ రోజురోజుకు కొత్త కేసుల సంఖ్య పెరుగుతుండటంతో లాక్డౌన్ విధిస్తారనే ప్రచారం జరుగుతున్నది. ఆదివారం ఒక్కరోజే అత్యధికంగా 823 కొత్త కేసులు నమోదయ్యాయి. దాంతో అక్కడ మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య కూడా 3,409 నుంచి 3,618కి పెరిగింది. అలాగే ఆదివారం ఒక కరోనా రోగి మృతిచెందడంతో.. అక్కడ మొత్తం కరోనా మరణాల సంఖ్య 10,956కు చేరింది.
ఒకవైపు కరోనా కొత్త కేసులు వేగంగా పెరుగుతుండటం, మరోవైపు ఈ నెల 28న హోలీ పండగ ఉండటం లాంటి పరిణామాల నేపథ్యంలో ఢిల్లీలో కఠిన ఆంక్షల అమలుకు ప్రభుత్వం సిద్ధమైంది. అధికారులు కూడా ఈ నెల 30 వరకు నగరంలో లాక్డౌన్ విధించాలని ప్రభుత్వానికి సూచించారు.