ముంబై, ఏప్రిల్ 26: మన దేశంలో రైళ్లు సంవత్సరంలో చాలా రోజులు ప్రయాణికులతో కిటకిటలాడుతూనే ఉంటాయి. ప్రత్యేకించి పండుగల సమయాల్లో ఈ రద్దీ చాలా అధికంగా ఉంటుంది. ముంబై లాంటి మహానగరాల్లో, అందునా లోకల్ రైళ్లలో ఈ రద్దీ ఎప్పుడూ ఉండేదే. జనంతో కిటకిటలాడుతున్న రైళ్లను ఎక్కలేక కింద పడిపోయి గాయాలైనవారి ఉదంతాలు తరచుగా వినిపించేవే. ఇలాంటివి ‘అవాంఛనీయ ఘటనల’ కిందికే వస్తాయని, ఆయా ఘటనల్లో గాయపడినవారికి పరిహారం చెల్లించాల్సిందేనని బాంబే హైకోర్టు తేల్చిచెప్పింది.
రద్దీగా ఉన్న లోకల్ రైలును ఎక్కే క్రమంలో కింద పడిపోయి కాలికి గాయాలైన 75 ఏండ్ల వృద్ధునికి పరిహారం చెల్లించాలని జస్టిస్ భారతి డాంగ్రే ధర్మాసనం పశ్చిమ రైల్వేని ఆదేశించింది. పిటిషనర్ నితిన్ హుండీవాలా కదులుతున్న రైలును ఎక్కేందుకు ప్రయత్నించి కింద పడిపోయాడని, కాబట్టి ఇది రైల్వేల చట్టంలోని 124(ఏ) సెక్షన్ నిబంధనల ప్రకారం ‘అవాంఛనీయ ఘటన’ కిందికి రాదని పశ్చిమ రైల్వే చేసిన వాదనతో బాంబే హైకోర్టు ధర్మాసనం విభేదిస్తూ ఈ తీర్పు ఇచ్చింది.