Liquor sale : తెలంగాణలో మద్యం అమ్మకాలు మరోసారి రికార్డు స్థాయిలో జరిగాయి. దసరా పండుగ సందర్భంగా రాష్ట్రంలో మద్యం ఏరులై పారింది. పది రోజుల్లో దాదాపుగా వెయ్యి కోట్ల రూపాయల మద్యం విక్రయాలు జరిగాయి. బార్లు, మద్యం దుకాణాలతోపాటు పబ్లలోనూ భారీగా మద్యం అమ్మకాలు పెరిగాయి. దాంతో ఖజానాకు మద్యం భారీగా ఆదాయం సమకూరింది. హైదరాబాద్ నగరంలోనే భారీగా మద్యం అమ్మకాలు జరిగినట్లు అధికారులు తేల్చారు.
తెలంగాణలో మొత్తం 2,260 మద్యం దుకాణాలు, 1,171 బార్లు, రెస్టారెంట్లు ఉన్నాయి. వీటితోపాటుగా పబ్లలోనూ మద్యం అమ్మకాలు కొనసాగుతున్నాయి. ప్రతి ఏటా దసరా వేళ తెలంగాణలో మద్యం అమ్మకాలు భారీగా ఉంటాయి. ఈసారి అదే అంచనాతో ముందుగానే ఎక్సైజ్ శాఖ భారీగా మద్యం నిల్వలను సిద్దం చేసింది. అదేవిధంగా ఆర్డర్లు వచ్చాయి. బార్లు, మద్యం దుకాణాలు భారీగా స్టాక్ను మెయింటెయిన్ చేశాయి. దసరా ప్రారంభానికి ముందు నుంచే అమ్మకాల కిక్కు మొదలైంది. 2024 సెప్టెంబర్ 30 వరకు 2,838.92 కోట్ల అమ్మకాలు జరిగాయి.
ఈ నెల ప్రారంభం నుంచి 11వ తేదీ వరకు రూ.1,057.42 కోట్ల మేర విలువైన 10.44 లక్షల కేసుల లిక్కర్ విక్రయాలు జరిగినట్లు లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. అదేవిధంగా 17.59 లక్షల బీర్ల కేసుల అమ్మకాలు జరిగాయి. అమ్మకాల్లో రంగారెడ్డి జిల్లా ముందుండగా, కరీంనగర్, నల్లగొండ, వరంగల్ జిల్లాలు ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. పండగ చివరి మూడు రోజులు అమ్మకాలు పీక్ స్థాయిలో జరిగాయి. ఎక్సైజ్ డిపోల నుంచి రూ.205.42 కోట్ల మేర విలువైన మద్యం రిటైల్ దుకాణాలకు చేరింది. అందులో లిక్కర్, బీర్ల అమ్మకాలు పోటీపడ్డాయి.
ఇక పండుగ చివరి రోజైన శనివారం, ఆదివారం రెట్టింపు స్థాయిలో అమ్మకాలు జరిగినట్లు లెక్కలు తేల్చాయి. మొత్తంగా ఈ 10 రోజుల్లో తెలంగాణలో దాదాపుగా వెయ్యి కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగినట్లు అబ్కారీ అధికారులు చెబుతున్నారు. దాంతో రాష్ట్ర ఖజనాకు అనూహ్యంగా తక్కువ వ్యవధిలోనే భారీగా ఆదాయం సమకూరింది.