న్యూఢిల్లీ: మద్యం పాలసీ కేసు నిందితుడి డబ్బు బీజేపీ ఖాతాలోకి వెళ్లిందని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఆరోపించింది. ఎలక్టోరల్ బాండ్లుగా అతడి నుంచి కోట్లాది డబ్బు తీసుకున్న బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాను అరెస్ట్ చేయాలని ఆప్ మంత్రి అతిషి డిమాండ్ చేశారు. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో (liquor policy case) సీఎం అరవింద్ కేజ్రీవాల్ను అరెస్ట్ చేసిన నేపథ్యంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతోపాటు దర్యాప్తు సంస్థల తీరుపై ఆమె మండిపడ్డారు. ఈ కేసుపై రెండేళ్లుగా దర్యాప్తు చేస్తున్న సీబీఐ, ఈడీ ఇప్పటి వరకు అరెస్ట్ చేసిన ఏ ఆప్ నాయకుడి నుంచి డబ్బుకు సంబంధించిన ఆధారాలు చూపించలేకపోయాయని అతిషి తెలిపారు. ఈ రెండేళ్లలో మనీ జాడ ఎక్కడ? డబ్బు ఎక్కడికి పోయింది? అన్న ప్రశ్నలు మళ్లీ మళ్లీ వస్తున్నాయని అన్నారు. ఆప్కు చెందిన ఏ నేత, మంత్రి లేదా కార్యకర్త నుంచి ఎలాంటి డబ్బును దర్యాప్తు సంస్థలు స్వాధీనం చేసుకోలేదని ఆమె గుర్తు చేశారు.
కాగా, లిక్కర్ పాలసీ కేసులో గత ఏడాది నవంబర్లో ఈడీ అరెస్ట్ చేసిన అరబిందో ఫార్మాకు చెందిన శరత్ చంద్రా రెడ్డి వాంగ్మూలం ఆధారంగా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ను అరెస్ట్ చేశారని మంత్రి అతిషి తెలిపారు. కేజ్రీవాల్ను తాను ఎప్పుడూ కలవలేదని, మాట్లాడలేదని, ఆప్తో తనకు ఎలాంటి సంబంధం లేదని శరత్ చంద్రారెడ్డి గతంలో స్పష్టంగా చెప్పారన్నారు. అయితే చాలా కాలం జైలులో ఉన్న తర్వాత అప్రూవర్గా మారిన ఆయన తన స్టేట్మెంట్ను మార్చారని ఆమె ఆరోపించారు.
మరోవైపు లిక్కర్ పాలసీ కేసుకు సంబంధించిన డబ్బు ఎక్కడుంది? ఆ మనీ జాడ ఎక్కడ? అని మంత్రి అతిషి ప్రశ్నించారు. ఆ డబ్బు బీజేపీ బ్యాంకు ఖాతాలోకి వెళ్లిందని ఆమె ఆరోపించారు. ‘ఆయన (శరత్ చంద్రా రెడ్డి) రూ. 4.5 కోట్ల విలువైన ఎలక్టోరల్ బాండ్లు బీజేపీకి ఇచ్చాడు. ఆ తర్వాత రూ. 55 కోట్ల విలువైన బాండ్లను కూడా ఇచ్చాడు. లిక్కర్ స్కామ్ నిందితుడి డబ్బులు బీజేపీ ఖాతాలో కనిపించాయి. ప్రధాని మోదీ, ఈడీకి నేను సవాల్ చేస్తున్నా. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను అరెస్టు చేయాలి’ అని అతిషి డిమాండ్ చేశారు.
AAP Senior Leaders Addressing an Important Press Conference | LIVE https://t.co/iAhixaPKwR
— AAP (@AamAadmiParty) March 23, 2024