న్యూఢిల్లీ: ఆధార్(Aadhaar)తో ఓటర్ ఐడీ(Voter id) వివరాలను జత చేసే కార్యక్రమాన్ని ఇంకా ప్రారంభించలేదని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు(minister kiren rijiju) తెలిపారు. ఇవాళ రాజ్యసభలో ఈ అంశంపై లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ఓటరు కార్డుతో ఆధార్ అనుసంధానం ఓ ప్రక్రియ ప్రకారం జరుగుతుందని, అయితే ఆ లింకేజీ గురించి ఇప్పటి వరకు ఎటువంటి నిర్దేశిత సమయాన్ని కేటాయించలేదని మంత్రి పేర్కొన్నారు.
ఆధార్తో ఓటరు కార్డు లింక్ చేయని పేర్లను ఓటరు జాబితా నుంచి తొలగించడం లేదన్నారు. ప్రజాప్రతినిధుల చట్టం ప్రకారం ఎన్నికల చట్టాలకు సవరణలు చేశామని, దాని ప్రకారం ఓటు రిజిస్ట్రేషన్ ఆఫీసర్కు ఆధార్ నెంబర్ను జతపరుచాల్సి ఉంటుందని మంత్రి తెలిపారు.
2022 ఆగస్టు ఒకటో తేదీ నుంచి కేంద్ర ఎన్నికల సంఘం ఓటర్ల నుంచి ఆధార్ నెంబర్లను కూడా సేకరిస్తున్న విషయం తెలిసిందే. ఆధార్సంఖ్యను సమర్పించేందుకు గడువు తేదీని 2024 మార్చి 31 వరకు పెంచినట్లు మంత్రి చెప్పారు.