Mallikarjun Kharge | బీహార్ సీఎంగా నితీశ్ కుమార్ రాజీనామాపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పందించారు. ‘ఇలా జరుగుతుందని నాకు తెలుసు. దేశంలో చాలా మంది ‘ఆయారామ్-గయారామ్ లు ఉన్నారు’ అని వ్యాఖ్యానించారు.
‘ఇంతకుముందు నేను ఆయన (నితీశ్ కుమార్) కలిసి పోరాడాం. లాలూజీ, తేజస్వీతో నేను మాట్లాడినప్పుడు కూటమి నుంచి నితీశ్ వెళ్లిపోతున్నారని వారు కూడా చెప్పారు. ఒకవేళ ఆయన ఇక్కడే కొనసాగాలని అనుకుంటే ఉండేవారు కానీ, ఆయన వెళ్లిపోవాలనుకున్నారు. అందుకే ఆ విషయం మాకు ముందే తెలుసు. ఇండియా కూటమిని యధాతథంగా కొనసాగించాలని మేం భావించాం. కానీ మేమేదైనా చెబితే తప్పుడు సంకేతాలు వెళాయి. లాలూ ప్రసాద్ యాదవ్, తేజస్వీ యాదవ్ ఈ సంగతి మాకు చెప్పారు. ఈ రోజు అది రుజువైంది. దేశంలో చాలా మంది ‘ఆయారాం-గయారాం’లు తయారయ్యారు’ అని ఖర్గే వ్యాఖ్యానించారు.
ఇదిలా ఉంటే పాట్నాలో జేడీయూ అధ్యక్షుడు నితీశ్ కుమార్ ఆదివారం రాజ్ భవన్కు వెళ్లి గవర్నర్ రాజేంద్ర ఆర్లేకర్ కు రాజీనామా సమర్పించారు. రాష్ట్రంలో మహా ఘట్ బంధన్ ప్రభుత్వానికి చరమ గీతం పాడి, బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీఏ కూటమిలో నితీశ్ కుమార్ చేరతారని వార్తలొచ్చిన నేపథ్యంలో ఆయన రాజీనామా ప్రాధాన్యం సంతరించుకున్నది.