గురుగ్రామ్: చెట్టు కింద ఉన్న నలుగురిపై పిడుగు పడినా అదృష్టవశాత్తూ ప్రాణాలతో బయటపడ్డారు. పిడుగుపాటు మంటల వల్ల కాలిన గాయాలైన ఆ వ్యక్తులు ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. హర్యానాలోని గురుగ్రామ్లో ఈ ఘటన జరిగింది. సెక్టార్ 82 లోని సిగ్నేచర్ విల్లా వాటికా సిటీలో శుక్రవారం సాయంత్రం 4.30 గంటలకు వర్షం కురుస్తున్నది. శివదత్, రామ్ ప్రసాద్, లాలి, అనిల్ అనే నలుగురు తోట పనివాళ్లు ఆ సమయంలో అక్కడ పని చేస్తున్నారు. వాన పడుతుండటంతో ఆ నలుగురు ఒక చెట్టు కిందకు చేరారు.
అయితే, ఉన్నట్టుండి ఆ చెట్టుపై పిడుగుపడింది. దీంతో ఆ నలుగురు పిడుగుపాటుకు కుప్పకూలి కిందపడిపోయారు. అక్కడి సీసీటీవీలో ఇది రికార్డు అయ్యింది. ఆ నలుగురు చనిపోయి ఉంటారని అంతా భావించారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు వచ్చి పరిశీలించారు. కాలిన గాయాలతో పడి ఉన్న నలుగురిని వెంటనే రెండు ప్రైవేటు ఆసుపత్రులకు తరలించారు.
కాగా, ముగ్గురికి ప్రాణాపాయం తప్పిందని వైద్యులు తెలిపారు. ఒకరి పరిస్థితి సీరియస్గా ఉండటంతో ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. మరోవైపు సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది.