మథుర: ఉత్తరప్రదేశ్లోని మథురలో చేపట్టిన బన్కే బీహారి టెంపుల్ కారిడార్ పనులను వెంటనే నిలిపివేయించాలని కోరుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్కు మథుర ప్రజలు రక్తంతో లేఖలు రాశారు. ఈ కారిడార్ వల్ల తమ పూర్వీకులు ఇచ్చిన ఇండ్లు పోయి రోడ్డు మీద పడతామని, దుకాణాలు పోయి జీవనోపాధి కోల్పోతామని వారు వాపోయారు. ఈ కారిడార్ వల్ల మథుర ప్రాంతంలో ఉన్న వారసత్వ కట్టడాలు కూడా ధ్వంసమవుతాయని పేర్కొన్నారు. వెంటనే ఈ కారిడార్ ప్రతిపాదనను నిలిపేసేలా చూడాలని కోరారు. అప్పటివరకు ఆందోళనలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. కాగా, ప్రతిపాదిత కారిడార్ నిర్మాణం కోసం ఎనిమిది మంది సభ్యులతో కూడిన కమిటీ ఇటీవల సర్వే కూడా జరిపింది.