కర్ణుడు బతికుండగానే అడగ్గానే తన కవచకుండలాలను ఓ బ్రాహ్మణుడికి దానం చిరస్మరణీయుడయ్యారు. మనం మట్టిలో కలిసిపోకముందే మన అవయవాలను మరికొందరికి దానం చేసి ప్రాణం పోయవచ్చు. అవయవదానం వల్ల ఒక్కరు పదుల సంఖ్యలో జీవితాలను నిలబెట్టవచ్చనే నిజం మనలో చాలా మందికి తెలియదు. అవయవదానంపై సరైన అవగాహన లేకపోవడం కారణంగా.. ఏ కారణంగా చనిపోయినా మనం మట్టిలో కలిసిపోతున్నామే కానీ, మరొకరి జీవితాన్ని నిలపవచ్చునని ఆలోచించడం లేదు.
అవయవదానంపై మనలో చాలా మందికి సరైన అవగాహన లేదు. నిజానికి ఏ వయసు వారైనా అవయవదానం చేయవచ్చు. 18 ఏండ్లలోపు వారు తల్లిదండ్రుల అనుమతితో ఈ బృహత్ కార్యక్రమంలో పాల్గొనవచ్చు. అవయవదానాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా జీవన్దాన్ అనే సంస్థను ఏర్పాటు చేసింది. అవయవాలు కావాల్సిన వారు ఈ సంస్థలో తమ పేర్లను నమోదు చేసుకోవాలి. ప్రాధాన్యతాక్రమం ఆధారంగా సేకరించిన అవయవాలను నిపుణుల పర్యవేక్షణలో అందిస్తారు. అలాగే, రోడ్డు ప్రమాదాల్లో తీవ్రంగా గాయపడి బ్రెయిన్డెడ్గా వైద్యులు ప్రకటించిన వారి కుటుంబీకులు కూడా ఈ సంస్థను సంప్రదించి తమ వారి అవయవాలను దానం చేస్తారు. కొన్నిసార్లు జీవన్దాన్ సభ్యులే ఇలాంటి వారిని గుర్తించి వారి అనుమతితో అవయవాలను సేకరిస్తారు.
అవయవాలు అందుబాటులో లేక ఎందరో రోగులు మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు. కొందరు ప్రాణాలు కోల్పోతున్నారు. మనం ఇంకా సామాజిక, మతపరమైన కట్టుబాట్ల మధ్య కొట్టుమిట్టాడుతూ ఉన్నాం. ఫలితంగా అవయవాలను దానం చేసేందుకు చాలా తక్కువ మంది ముందుకొస్తున్నారు. అవగాహనాలోపం, అపోహలు అవయవదానానికి ప్రధాన ప్రతిబంధకాలుగా మారాయి. మనకు అవసరం వచ్చినప్పుడు కాకుండా అందరి కోసం అవయవ దానంపై విస్తృతంగా ప్రచారం నిర్వహించాలి. జీవన్దాన్లో పెద్ద సంఖ్యలో దాతల పేర్లు నమోదయ్యేలా చూడాలి. మనకు తెలిసిన వారు బ్రెయిన్డెడ్ అయిన సందర్భాల్లో వారి కుటుంబాలను ఒప్పించి అవయవాలను దానం చేపించాలి.