జైపూర్: ఒక గ్రామానికి చెందిన ప్రజలపై చిరుత దాడి చేస్తున్నది. ఈ సంఘటనల్లో ఒకరు మరణించారు. నలుగురు గాయపడ్డారు. ఈ నేపథ్యంలో ఆ గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు. ఆ చిరుతను పట్టుకునేందుకు అటవీశాఖ అధికారులు ప్రయత్నిస్తున్నారు. (Leopard Terror In Udaipur) రాజస్థాన్లోని ఉదయ్పూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఉమర్దా ఖేడా గ్రామంలో ఒక చిరుత సంచరిస్తున్నది. 18 గంటల వ్యవధిలో ఐదుగురు గ్రామస్తులపై దాడి చేసింది. బుధవారం నలుగురు గ్రామస్తులు ఇరుకైన దారిలో కలిసి నడుస్తుండగా అకస్మాతుగా ఒక చిరుత పొదల నుంచి బయటకు వచ్చింది. ఆ గుంపులో ముందు నడుస్తున్న కాలూతో పాటు మరికొందరిపై అది దాడి చేసింది. గ్రామస్తులు రాళ్లతో దాడి చేయడంతో ఈడ్చుకెళ్తున్న కాలూను వదిలి పారిపోయింది.
కాగా, దీనికి ముందు ఆ చిరుత ఒక వ్యక్తిపై దాడి చేయగా అతడి భుజానికి గాయమైంది. ఒక మహిళపై కూడా దాడి చేసింది. 45 ఏళ్ల లోగ్రి బాయి కేకలు వేసింది. సహాయం కోసం గ్రామస్తులను ఆమె పిలవడంతో అది పారిపోయింది. గాయపడిన ఆ మహిళతో పాటు 60 ఏళ్ల జగ, 20 ఏళ్ల హితేష్, 40 ఏళ్ల కాలూ కూడా మహారాణా భూపాల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
మరోవైపు మంగళవారం సాయంత్రం 45 ఏళ్ల లోగర్ లాల్ మీనాపై ఆ చిరుత దాడి చేసింది. తీవ్రంగా గాయపడిన అతడ్ని మహారాణా భూపాల్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ బుధవారం సాయంత్రం మరణించాడు.
అయితే చిరుత సంచారం, వరుస దాడులతో ఉమర్దా ఖేడా గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు. దానిని పట్టుకునేందుకు అటవీశాఖ అధికారులు రంగంలోకి దిగారు. పలు చోట్ల బోనులు ఏర్పాటు చేశారు. చిరుత కదలికలను పర్యవేక్షించేందుకు కెమెరాలను కూడా అమర్చారు. భిందర్, కురాబాద్, ఉదయపూర్, పరిసర ప్రాంతాల అటవీ సిబ్బందిని ఈ ప్రాంతంలో మోహరించారు.
గ్రామస్తులు ఒంటరిగా తిరుగవద్దని, రక్షణ కోసం కర్రలు పట్టుకుని గుంపులుగా ప్రయాణించాలని అటవీ శాఖ అధికారి సూచించారు. పిల్లలతో పాటు కొందరు గ్రామస్తులను సురక్షిత ప్రాంతానికి తరలించినట్లు వెల్లడించారు.