ఓ చిరుతపులి వ్యక్తిపై దాడి చేసింది. అప్పటికే అప్రమత్తంగా ఉన్న ఆ వ్యక్తి దానిపై ప్రతిదాడి చేశాడు. చిరుతపులికి అవకాశం ఇవ్వకుండా కత్తితో దానిపై విరుచుకుపడ్డాడు. అనంతరం గ్రామస్తులంతా అతడికి తోడయ్యారు. ఆ చిరుతపులిని కొట్టి చంపేశారు. ఈ వీరోచిత ఘటన కేరళలో జరిగింది.
ఇడుక్కి జిల్లాలోని మంకులం గ్రామంలో కొద్దిరోజులుగా చిరుతపులి సంచరిస్తున్నది. గ్రామస్తులకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నది. విషయాన్ని ఫారెస్ట్ అధికారులకు తెలుపగా, వారు అప్రమత్తమయ్యారు. దాన్ని బంధించేందుకు బోను ఏర్పాటు చేసినా, చిక్కలేదు. కాగా, శుక్రవారం ఉదయం రెండు మేకలపై దాడి చేసి, చంపేసింది. అదేరోజు రాత్రి గోపాలన్ అనే వ్యక్తిపై దాడి చేసేందుకు వచ్చింది. చిరుతను గమనించిన గోపాలన్ కత్తితో దానిపై ప్రతిదాడి చేశాడు. చిరుతకు చిక్కకుండా దాని శరీరంపై కత్తితో పొడిచాడు. స్థానికులు అతడికి సాయంగా నిలిచారు. చివరకు చిరుతపులిని చంపేశారు. ఈ దాడిలో గాయపడ్డ గోపాలన్ దవాఖానలో చికిత్స పొందుతున్నాడు. తనకు వేరే మార్గం లేదని, ప్రాణాలు కాపాడుకునేందుకు చిరుతపై దాడిచేయక తప్పలేదని గోపాలన్ తెలిపాడు.