లక్నో: ఒక ఇంట్లోకి చిరుత పులి ప్రవేశించింది. దానిని చూసి భయపడిన కుటుంబ సభ్యులు ఒక గదిలో బంధించుకున్నారు. ఈ విషయం తెలిసిన అటవీ శాఖ సిబ్బంది, అధికారులు అక్కడకు చేరుకున్నారు. సుమారు 8 గంటలు శ్రమించి ఆ చిరుతను బంధించారు. (Leopard Enters House) ఉత్తరప్రదేశ్లోని మీరట్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. శనివారం ఉదయం పది గంటలకు కసెరుఖేడా ప్రాంతంలోని సమీర్ అనే వ్యక్తి ఇంట్లోకి చిరుత ప్రవేశించింది. ఒక గదిలో ఉన్న వృద్ధురాలు, ఇద్దరు పిల్లలు దానిని చూసి భయాందోళన చెందారు. వెంటనే తలుపులు మూసి ఆ గదిలో ఉండిపోయారు. దీంతో ఆ చిరుత ఆ గది బయట కూర్చొన్నది.
కాగా, ఈ విషయం తెలిసిన అటవీ శాఖ అధికారులు, సిబ్బంది అక్కడకు చేరుకున్నారు. చిరుత తప్పించుకోకుండా ఆ ఇంటి చుట్టూ వలలు ఏర్పాటు చేశారు. గోడను పగులగొట్టి గదిలో ఉన్న వృద్ధురాలు, ఇద్దరు పిల్లలను బయటకు తీసుకువచ్చారు. సుమారు 8 గంటలపాటు శ్రమించారు. మత్తుమందు ఇచ్చి చిరుతను బంధించారు. ఆ ఇంట్లోకి ప్రవేశించే ముందు ఒక వ్యక్తిపై ఆ చిరుత దాడి చేయడంతో అతడు గాయపడినట్లు అటవీ శాఖ అధికారి తెలిపారు.