చంఢీగడ్: పంజాబ్లోని కపుర్తలా మాడ్రన్ జైలులో నిమ్మకాయల కుంభకోణం జరిగింది. ఈ ఘటనలో ఆ జైలు ఆఫీసర్పై అధికారులు వేటు వేశారు. ఖైదీల ఆహారం కోసం కేటాయించిన నిధులను దుర్వినియోగం చేసినట్లు జైలర్ గుర్నామ్ లాల్పై ఆరోపణలు వచ్చాయి. దీంతో అధికారులు చర్యలు తీసుకున్నారు. జైలు రికార్డుల్లో 50 కిలోల నిమ్మకాయలు కొన్నట్లు ఉన్నా.. ఆ జైలులో ఉంటున్న ఖైదీలు మాత్రం తమకు నిమ్మకాయలు అందడం లేదని ఆరోపించారు.
ఇటీవల దేశవ్యాప్తంగా నిమ్మకాయలకు డిమాండ్ పెరిగిన విషయం తెలిసిందే. ఓ దశలో కిలో రూ.500కు అమ్మారు. అయితే ఖైదీ మెనూలో నిమ్మకాయలను కలపడంతో ఈ వివాదం తెరమీదకు వచ్చింది. తనిఖీ కోసం వెళ్లిన అధికారులు ఖంగుతిన్నారు. తమకు ఇవ్వాల్సిన రేషన్లో నిమ్మకాయలు లేవని ఆ జైలులో ఉన్న ఖైదీలు అధికారులకు ఫిర్యాదు చేశారు. జైళ్ల శాఖ మంత్రి హర్జోత్ సింగ్ బెయిన్స్ కూడా ఈ మ్యాటర్ను సీరియస్గా తీసుకుని దర్యాప్తునకు ఆదేశించారు.
అవకతవకలు జరిగినట్లు దర్యాప్తులో తేలింది. దీంతో జైలర్ గుర్నామ్ లాల్ను సస్పెండ్ చేశారు. ఒక్కొక్క చపాతీ బరువు కూడా 50 గ్రాముల కన్నా తక్కువ బరువు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. కూరగాయల ఖరీదులోనూ అక్రమాలు జరిగినట్లు పసికట్టారు.