Supriya Sule | బీజేపీలో విపక్షాల నేతల చేరికలపై ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కూతురు, ఎంపీ సుప్రియా సూలే సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ సిద్ధాంతాలు నచ్చినందు వల్లే ఆ పార్టీలో విపక్షాల నేతలు చేరడం లేదని చెప్పారు. కానీ ‘ఐసీఈ- ఇన్కం టాక్స్, సీబీఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)లకు భయపడి మాత్రమే బీజేపీలో చేరుతున్నారు’ అని ఓ ఆంగ్ల టీవీ చానెల్కిచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. మహారాష్ట్రలోని బారామతి లోక్సభ స్థానం పవార్ కుటుంబానికి కంచుకోట వంటిది. 2009 నుంచి సుప్రియా సూలే అక్కడి నుంచి లోక్సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అంతకుముందు 1996 నుంచి 2009 వరకూ బారామతి స్థానం నుంచి శరద్ పవార్ ఎన్నికయ్యారు.
కానీ, ఈ దఫా సార్వత్రిక ఎన్నికల్లో స్వల్ప తేడా ఉంది. శరద్ పవార్ సారధ్యంలోని ఎన్సీపీ నుంచి ఆయన సోదరుడి కుమారుడు అజిత్ పవార్ తిరుగుబాటు చేసి, మహారాష్ట్ర ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా చేరారు. అజిత్ పవార్ సారధ్యంలోని ఎన్సీపీనే అసలైన ఎన్సీపీగా కేంద్ర ఎన్నికల సంఘం గుర్తించింది. ఈ నేపథ్యంలో త్వరలో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో బారామతి స్థానం నుంచి ఆసక్తికర పోటీ నెలకొనే అవకాశం ఉంది. సుప్రియా సూలేపై మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ భార్య సునేత్ర పవార్ పోటీ చేస్తారని భావిస్తున్నారు. అయితే, తనకు వ్యతిరేకంగా ఎవరో పోటీ చేస్తున్నారో అధికారికంగా ప్రకటించలేదని సుప్రియా సూలే చెప్పారు. అధికారికంగా తన ప్రత్యర్థి ఎవరో తేలిన తర్వాత తాను స్పందిస్తానన్నారు.
మద్యం కుంభకోణం కేసులో ఢిల్లీ సీఎం- ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ నేపథ్యంలో ప్రతిపక్ష ఇండియా కూటమి విజయావకాశాలపై ఆమె స్పందించారు. ‘ప్రజాస్వామ్యం హత్యకు గురైంది. విపక్ష నేతలపై సీబీఐ, ఈడీ, ఇన్ కం టాక్స్ అధికారులు దాడి చేస్తారు. తర్వాత వారు బీజేపీలో చేరతారు. ఇంతకుముందు అశోక్ చవాన్ పై దాడులు జరిగాయి. ఆయన బీజేపీలో చేరారు. వారు విపక్షాలను ఇలా బలహీన పరుస్తున్నారు. ఇది రాజకీయం కాదు.. ఇది ప్రజాస్వామ్యాన్ని హత్య చేయడమే’ అని సుప్రియా సూలే పేర్కొన్నారు.