ముంబై : ఈ కాక్పిట్ ముద్దుగుమ్మను చూస్తున్నారా? ఈమె పేరు లక్ష్మీ జోషి. ఎయిర్ ఇండియా పైలెట్ ఈమె. లక్ష్మీ జోషి ప్రదర్శించిన ధైర్యసాహాసాలకు జనం సెల్యూట్ కొడుతున్నారు. కరోనా మహమ్మారి తొలి దశ వేళ.. విదేశాల్లో చిక్కుకున్న వారిని తీసుకువచ్చేందుకు వందేభారత్ మిషన్ చేపట్టిన విషయం తెలిసిందే. అయితే ఈ మిషన్లో లక్ష్మీ జోషి కీలక పాత్ర పోషించింది. ఓ పైలెట్గా తన కర్తవ్యాన్ని నిర్విఘంగా పూర్తి చేసింది. ఆ కల్లోల సమయంలో చైనాకు వెళ్లి అక్కడ చిక్కుకున్న భారతీయుల్ని స్వదేశానికి సురక్షితంగా తీసుకువచ్చింది. ఆమె ప్రదర్శించిన తెగువ.. యువతకు ఎంతో స్పూర్తినిస్తోంది.
వందే భారత్ మిషన్లో పాల్గొన్న ఏకైక ఎయిర్ ఇండియా మహిళా పైలెట్ లక్ష్మీ జోషి. హ్యూమన్స్ ఆఫ్ బాంబే ఇన్స్టాగ్రామ్లో ఆమె తన స్టోరీని ప్రజెంట్ చేసింది. 8 ఏళ్ల వయసులో ఆమె తొలిసారి విమానం ఎక్కిందట. అప్పుడే పైలెట్ కావాలని ఆమె డిసైడ్ అయ్యింది. ఆ తర్వాత 12వ తరగతి పూర్తి చేసి.. ఆ విషయాన్ని మళ్లీ నాన్నకు చెప్పింది. లక్ష్మీ పైలెట్ అయ్యేందుకు వాళ్ల నాన్న కూడా ఓకే చెప్పేశాడు. దాంతో ఆమె పైలెట్ శిక్షణ తీసుకున్నది. రెండేళ్ల తర్వాత ఎయిర్ ఇండియాలో ఇక జాబ్ కూడా కొట్టేసింది.
కరోనా సంక్షోభం వేళ లక్ష్మీ జోషి తొలిసారి చైనాలోని షాంఘైకి వెళ్లింది. అక్కడున్న భారతీయుల్ని తీసుకువచ్చింది. నిజానికి ఆమె తల్లితండ్రులు ఆ ట్రిప్ సమయంలో ఎంతో ఆందోళనకు గురయ్యారు. పాండమిక్ వేళ ఏం జరుగుతుందో తెలియని స్థితి. కానీ లక్ష్మీ తనలో పట్టుదలను వీడలేదు. నిర్భయంగా చైనాకు వెళ్లి ఇండియన్లను తీసుకువచ్చింది. హజ్మట్ సూట్లతో కాక్పిట్లో కూర్చుని ప్రయాణం చేయడం అంత సులువుకాదన్న విషయాన్ని ఆమె చెప్పింది. భారతీయ బృందంలో ఓ చిన్నారి తన వద్దకు వచ్చి థ్యాంక్స్ చెప్పిన తీరు పట్ల లక్ష్మీ సంతోషం వ్యక్తం చేసింది. తాను కూడా పైలెట్ కావాలన్న అభిప్రాయాన్ని ఆ చిన్నారి చెప్పింది. అప్పుడు ఆకాశమే హద్దు అని తండ్రి చెప్పిన మాటల్ని ఆమె గుర్తు చేసింది.
తీవ్రమైన స్థాయిలో వైరస్ వ్యాపిస్తున్న సమయంలోనే.. లక్ష్మీ జోషి ఒక నెలలో మూడు ట్రిప్లు కొట్టింది. ఇంకా ఆమె ఆ బిజీలోనే ఉంది. ప్రస్తుతం అమెరికాలో చిక్కుకున్న వారిని ఇండియాకు రప్పించేందుకు నివార్క్ వెళ్తోంది. కోవిడ్ వేళ పైలెట్ బాధ్యతలతో దేశ రక్షణలో పాల్గొన్న లక్ష్మీ జోషి ఓ సూపర్లేడీ. ఆమె స్టోరీ ఎప్పటికీ ఇన్స్పిరేషనే. ఇన్స్టాలో పోస్టు చేసిన స్టోరీకి నెటిజన్లు జేజేలు కొడుతున్నారు. ఆల్ ద బెస్ట్ లవ్లీ లక్ష్మీ జోషి.