ముంబై: అండర్ వరల్డ్ డాన్ దావూడ్ ఇబ్రహీం( Dawood Ibrahim ) పూర్వీకుల ఇల్లు త్వరలోనే ఓ సనాతన్ స్కూలుగా మారనుంది. మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లాలో అతని ఇల్లు ఉంది. ఈ ఇంట్లోనే దావూద్ బాల్యం గడిచింది. ఈ ఇంటిని స్మగ్లర్స్ అండ్ ఫారిన్ ఎక్స్చేంజ్ మానిపులేటర్స్ యాక్ట్ కింద వేలం వేయగా.. అజయ్ శ్రీవాస్తవ్ అనే లాయర్ రూ.11,20,000కు కొనుగోలు చేశారు. పాకిస్థాన్లోని కరాచీలో తలదాచుకుంటున్న దావూద్.. అక్కడ మదరసాలను ప్రోత్సహిస్తున్నాడని, అందుకే ఇక్కడ తాను అతని ఇంట్లో సనాతన స్కూలును ప్రారంభించాలని అనుకుంటున్నట్లు అజయ్ శ్రీవాస్తవ్ చెప్పడం గమనార్హం. ఈ ఇంటితోపాటు గతేడాది దావూద్కే చెందిన మరో రెండు ఆస్తులను ఇదే లాయర్ సొంతం చేసుకున్నారు.
1980ల్లో దావూద్ రత్నగిరి జిల్లాలోని ఈ ఇంట్లో ఉన్నాడు. ఆ తర్వాత అతని నలుగురు సోదరీమణుల్లో ఒకరు ఇందులో ఉండేవారు. కొంతకాలానికి ఆమె సమీపంలోని కాలువలో మునిగి చనిపోయిన తర్వాత కుటుంబీకులు ఇల్లు ఖాళీ చేశారు. దావూద్ తండ్రి ఇబ్రహీం కస్కర్కు ముంబై పోలీస్లో ఉద్యోగం వచ్చిన తర్వాత అతని కుటుంబ సభ్యులు ఈ ఇంటిని పూర్తిగా వదిలేశారు.
1993 ముంబై పేలుళ్ల తర్వాత ఇండియా మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్గా దావూద్ ఇబ్రహీంపై ముద్ర పడింది. 2003లో అమెరికా కూడా అతన్ని అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించింది. గతేడాది తమ భూభాగంలోని 88 ఉగ్రవాద సంస్థలపై ఆంక్షలు విధించిన సందర్భంగా తొలిసారి దావూద్ తమ దగ్గరే ఉన్నాడని పాక్ అంగీకరించింది. అతన్ని తమకు అప్పగించాలని ఎన్నోసార్లు ఇండియా డిమాండ్ చేసినా పాక్ వినిపించుకోలేదు.