74 ఏండ్లుగా న్యాయవాదిగా సేవలు
ఇటీవలే 100వ పుట్టినరోజు జరుపుకున్న లేఖ్రాజ్ మెహతా
జైపూర్, జూన్ 8: దేశానికి స్వాతంత్య్రం వచ్చిన 1947లో 26 ఏండ్ల వయసులో ఆయన న్యాయవాద వృత్తిని చేపట్టారు. ఆ వృత్తిలో ఏకంగా 74 ఏండ్లుగా కొనసాగినా.. విశ్రాంతి తీసుకోవాలని ఆయనకు అనిపించటం లేదు. ఇప్పటికీ.. ఈ కరోనా సమయంలో కోర్టులు మూతబడి.. వాదనలు, విచారణలు వీడియో కాన్ఫరెన్స్ రూపంలో జరుగుతున్నా కూడా యువ లాయర్లతో పోటీపడుతూ ఆయన అప్డేట్ అయ్యారు. ఆయనే రాజస్థాన్లోని జోధ్పూర్కు చెందిన లేఖ్రాజ్ మెహతా. ఇటీవలే ఆయన వందో పుట్టినరోజు జరుపుకున్నారు. న్యాయరంగంలో సుదీర్ఘ అనుభవం ఉన్న లేఖ్రాజ్కు ఎంతోమంది ప్రముఖులు శిష్యులు. సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎం లోధా, రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్, పలువురు హైకోర్టు న్యాయమూర్తులు ఆయన శిష్యుల జాబితాలో ఉన్నారు. కృష్ణజింకల వేట కేసులో బాలీవుడ్ హీరో సల్మాన్ఖాన్కు బెయిల్ ఇప్పించింది లేఖ్రాజ్ మెహతానే. క్రమశిక్షణ, మంచి ఆహారం, యోగా తన ఆరోగ్య రహస్యాలని లేఖ్రాజ్ చెబుతుంటారు.