పుల్వామా: జమ్ముకశ్మీర్లోని పుల్వామా (Pulwama) జిల్లాలో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. ఈ ఎన్కౌంటర్లో (Encounter) ఇద్దరు టెర్రరిస్టులు హతమయ్యారు. నిర్ధిష్ట సమాచారం మేరకు పుల్వామాలోని లారో-పరిగం ప్రాంతంలో (Larrow-Parigam) ఆదివారం అర్ధరాత్రి స్థానిక పోలీసులు, రాష్ట్రీయ రైఫిల్స్ (Rashtriya Rifles) సంయుక్తంగా ఉగ్రవాదుల కోసం గాలింపు చేపట్టాయి. ఈ క్రమంలో ఉగ్రవాదులు, భద్రతా దళాలకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలో భారత సైన్యం కాల్పుల్లో ఇద్దరు టెర్రరిస్టులు చనిపోయినట్లు కశ్మీర్ జోన్ పోలీసులు తెలిపారు. వారిలో ఒకరిని లష్కరే తొయీబా (Lashkar-e-Taiba) కమాండర్గా (Commander) అనుమానిస్తున్నామని చెప్పారు. ఆపరేషన్ ఇంకా కొనసాగుతున్నదని, మృతదేహాలను ఇంకా స్వాధీనం చేసుకోలేదని పోలీసులు వెల్లడించారు.
రెండు వారాల క్రితం రాజౌరీ (Rajouri) జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో ఓ ఉగ్రవాది హతమైన విషయం తెలిసిందే. ఆగస్టు 5న రాష్ట్రీయ రైఫిల్స్, కశ్మీర్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఈ ఆపరేషన్ను నిర్వహించాయి. కాగా, తాజా ఎన్కౌంటర్కు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.