ముంబై: మహారాష్ట్రను రుతుపవనాలు ముందే పలకరించడంతో ముంబై సహా పలు ప్రాంతాల్లో గత రెండు రోజులుగా భారీవర్షాలు కురుస్తున్నాయి. దీంతో థానే పట్టణం, పాల్ఘర్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో కొండ చరియలు విరిగిపడ్డాయి. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వానలతో గురువారం ఉదయం పాల్ఘర్ జిల్లాలో కొల్గావ్ బ్రిడ్జి కూలిపోయింది. అయితే ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని జిల్లా విపత్తు నిర్వహణ విభాగం చీఫ్ వివేకానంద కదమ్ చెప్పారు. వంతెన కుప్పకూలడంతో చుట్టుపక్కల గ్రామాలకు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.
ముంబ్రాలోని పన్వెల్ -కల్వా రహదారి, ముంబ్రా బైపాస్ రోడ్డు వద్ద భారీవర్షం కారణంగా కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో ఈ మార్గంలో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. సహాయబృందాలు కొండచరియలను తొలగిస్తున్నాయి. థానే నగరంలో భారీవర్షాల వల్ల మూడు వేర్వేరు ప్రాంతాల్లో ప్రహరీ గోడలు కూలడంతోపాటు, చెట్లు విరిగి పడటంతో ఆరు వాహనాలు దెబ్బతిన్నాయని థానే మున్సిపల్ కార్పొరేషన్ అధికారి సంతోష్ కదమ్ తెలిపారు. ఈ ఘటనల్లో ఎవరూ గాయపడలేదన్నారు. ముంబై, థానే, పాల్ఘర్, రాయ్గడ్ జిల్లాల్లో వచ్చే నాలుగు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ వాఖ హెచ్చరించింది.