పట్నా: బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధ్యక్షుడు లాలూప్రసాద్ యాదవ్ గాయపడ్డారు. పట్నాలోని తన సతీమణి రబ్రీదేవి ఇంట్లో ఉంటున్న ఆయన మెట్లు ఎక్కుతుండగా జారిపడ్డారు. దీంతో ఆయన భుజం విరగడంతోపాటు వెన్నెముకకు గాయాలయ్యాయి. దీంతో హుటాహుటిన ఆయనను దవాఖానకు తరలించామని సన్నిహితులు తెలిపారు. ఇప్పటికే లాలు పలు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. కిడ్నీ సమస్య చికిత్స కోసం విదేశాలకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే కోర్టు నుంచి అనుమతి కూడా తీసుకున్నారు.
దాణా కుంబకోణం కేసుల్లో ముద్దాయిగా తేలిన లాలుకి కోర్టు ఇప్పటికే జైలు శిక్షకూడా విధించింది. అయితే పలు ఆరోగ్యం కారణాలతో ప్రస్తుతం బెయిలుపై విడుదలయ్యారు. కాగా, ఈ మధ్యే రూ.139 కోట్ల దరోండా ట్రెజరీ కుంబకోణంలో లాలూని న్యాయస్థానం ముద్దాయిగా తేల్చిన విషయం తెలిసిందే.