స్పెషల్ టాస్క్ బ్యూరో హైదరాబాద్, డిసెంబర్ 26 (నమస్తే తెలంగాణ): సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జేడీయూలో ముసలం పుట్టింది. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు లలన్సింగ్ తన పదవికి రాజీనామా చేయబోతున్నారని ప్రచారం జరుగుతున్నది. ఢిల్లీలో ఈ నెల 28, 29 తేదీల్లో జరగనున్న జేడీయూ జాతీయ కార్యవర్గ సమావేశంలో ఆయన రాజీనామా చేయబోతున్నట్టు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. సీఎం నితీశ్ వైఖరి నచ్చకనే లలన్సింగ్ పార్టీ అధ్యక్ష పదవి నుంచి వైదొలుగుతున్నట్టు చెబుతున్నారు.
ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్ యాదవ్కు నితీశ్ సన్నిహితం కావడం, బీజేపీ రాష్ట్ర నాయకత్వంతో దోస్తీ కారణంగా లలన్సింగ్ అసంతృప్తితో ఉన్నట్టు చెబుతున్నారు. లలన్సింగ్ రాజీనామా చేశాక ఆ బాధ్యతలను నితీశ్కుమార్ స్వీకరించే అవకాశం ఉన్నదని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. అయితే లలన్సింగ్ రాజీనామా వార్తలను జేడీయూ ఖండించింది. నితీశ్, లలన్సింగ్ మధ్య ఎలాంటి విభేదాలు లేవని, బీజేపీనే వదంతులు సృష్టిస్తున్నదని పార్టీ అధికార ప్రతినిధి రాజీవ్ రంజన్ ప్రసాద్ పేర్కొన్నారు.