Lalan Singh: మతాన్ని రాజకీయాలకు వాడుకోవడం మంచి సంప్రదాయం కాదని జేడీయూ మాజీ అధ్యక్షుడు, సీనియర్ రాజకీయ నాయకుడు లలన్ సింగ్ అలియాస్ రంజన్ సింగ్ అభిప్రాయం వ్యక్తంచేశారు. తానూ హిందువునేనని, కానీ వాళ్లలా (బీజేపీ నేతలలా) తాను రాజకీయ ప్రయోజనాల కోసం మతాన్ని వాడుకోనని చెప్పారు. జేడీయూ చీఫ్ పదవి నుంచి తప్పుకున్న తర్వాత తొలిసారి లలన్ సింగ్ ముంగేర్ పార్లమెంటరీ నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన బీజేపీపై పలు విమర్శలు గుప్పించారు.
మతం, దేవుడిపై ఉన్న విశ్వాసాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం బహిరంగంగా ప్రదరర్శించాల్సిన అవసరం లేదని లలన్ సింగ్ అభిప్రాయపడ్డారు. తాను కూడా పవిత్రమైన హిందువునని, దేవుడిపై అధిక విశ్వాసం కలిగిన వాడినని, కానీ ఆ (బీజేపీ) నేతలవలె తాను రాజకీయ ప్రయోజనాల కోసం మతంపై ప్రేమను బయటకు ప్రదర్శించనని మండిపడ్డారు. ఆధ్యాత్మిక ప్రదేశాలు ప్రదర్శనా ప్రాంతాలు కాదని విమర్శించారు.
బీజేపీ నేతలు అబద్ధాలను ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని లలన్ సింగ్ ఆరోపించారు. దీనికి తోడు మీడియా సైతం స్పాన్సర్ చేసిన వార్తలనే ప్రజల్లోకి వ్యాప్తి చేస్తోందని మండిపడ్డారు. బీహార్ ప్రభుత్వం, జేడీయూ మధ్య చీలికలు వచ్చాయన్న వార్తలను ఆయన తీవ్రంగా ఖండించారు. ఇ వదంతులన్నీ సత్య దూరమని స్పష్టంచేశారు.
బీహార్లో సీఎం నితీశ్ కుమార్ నాయకత్వంలో ప్రభుత్వం స్థిరంగా ఉందని చెప్పారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఇండియా కూటమితో కలిసి బరిలో దిగుతామన్నారు. బీహార్లో బీజేపీకి, ప్రధాని మోదీకి వీడ్కోలు పలుకుతామని చెప్పారు. ప్రజలు కూడా బీజేపీకి వీడ్కోలు పలకడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. కాగా లలన్ సింగ్ను జేడీయూనే అధ్యక్ష పదవి నుంచి తొలగించిందని ప్రచారం జరుగుతోంది.
ముందుగా ఆర్సీపీ సింగ్ను జేడీయూకు అధ్యక్షుడిని చేసిన నితీశ్కుమార్.. ఆ తర్వాత ఆయనను తొలగించి లలన్ సింగ్కు బాధ్యతలు అప్పగించారని, ఇప్పుడు లలన్ సింగ్ను కూడా తొలగించి తానే అధ్యక్ష పదవిలో కూర్చున్నారని బీహార్ బీజేపీ నేత షానవాజ్ హుస్సేన్ విమర్శించారు. అది కూడా అసత్యమని అన్నారు. ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్తో సన్నిహితంగా ఉండటం వల్లే నితీశ్ తనను అధ్యక్ష పదవి నుంచి తప్పించినట్లు వినిపిస్తున్న వార్తలను కూడా ఆయన ఖండించారు. అలాంటి వార్తలు రాసిన మీడియాపై పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు.