గోరఖ్పూర్: అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతుండటంతో ఉత్తరప్రదేశ్లో రాజకీయం రసవత్తరంగా మారుతున్నది. అన్ని ప్రధాన పార్టీలతోపాటు పలు చిన్నాచితకా పార్టీలు కూడా వ్యూహప్రతివ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నాయి. ఇవాళ యూపీలో పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసిన ప్రధాని మోదీ.. గోరఖ్పూర్లో ఏర్పాటు చేసిన సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ వేదికపై నుంచే ప్రతిపక్ష సమాజ్వాది పార్టీపై ప్రధాని విమర్శలు గుప్పించారు.
ఉత్తరప్రదేశ్లో మళ్లీ అధికారం చేజిక్కించుకోవాలని ఎర్రటోపీలు ఎదురుచూస్తున్నాయని ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్వాది పార్టీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. వాళ్లు అధికారంలోకి వస్తే ఉగ్రవాదులతో దోస్తీ చేస్తారని, ఉగ్రవాదులను జైళ్ల నుంచి విడిచిపెడుతారని ఆరోపించారు. ఎర్రటోపీలే యూపీకి రెడ్ అలర్ట్ అని, ప్రమాద ఘంటికలని ప్రధాని విమర్శించారు.
ఎర్రటోపీలు అధికారంలోకి వస్తే ఎర్రబుగ్గలకు మాత్రమే ప్రాధాన్యం ఇస్తారని బుగ్గకార్లలో తిరిగే రాజకీయ నాయకులను ఉద్దేశించి ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. సాధారణ ప్రజల సమస్యలు, బాధలు వారికి పట్టవని చెప్పారు. కుంభకోణాలకు పాల్పడటానికి, ఖజానా నింపుకోవడానికి, దొరికింది దోచుకోవడానికి, మాఫియా శక్తులకు స్వేచ్ఛనివ్వడానికే సమాజ్వాది పార్టీ అధికారంపై కన్నేసిందని ఆరోపించారు.