ఉత్తరప్రదేశ్లోని లఖీంపూర్ ఖేరీలో జరిగిన హింసాకాండ దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. కేంద్ర సహాయ మంత్రి అజయ్ కుమార్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రాకు చెందిన కారు కొందరు రైతులను తొక్కేయడంతో ఈ హింసాకాండ మొదలైందని ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో ఆశిష్ కుమార్ స్పందించారు. ప్రమాదం జరిగిన సమయంలో తాను కారులో లేనని చెప్పారు. బన్వీర్పూర్లో ఒక మల్లయుద్ధం మ్యాచ్ నిర్వహణ కోసం తాను అక్కడే ఉన్నట్లు వెల్లడించారు.
‘‘ఇది 35 ఏళ్లుగా సంప్రదాయంగా జరుగుతున్న పోటీ ఇది. దాని నిర్వహణలో ఉండి నేనెక్కడికీ వెళ్లలేదు. సాయంత్రం వరకూ అక్కడే ఉన్నా’’ అని ఆశిష్ చెప్పారు. రాష్ట్ర ఉపముఖ్యమంత్రిని తీసుకువచ్చేందుకు తాను కారు పంపినట్లు ఆయన తెలిపారు. తన ఫార్చూన్ కారు రైతులపైకి దూసుకెళ్లడం కరెక్ట్ కాదన్న ఆయన.. కారు వస్తుండగా కొందరు కర్రలతో దాడి చేసినట్లు వెల్లడించారు. ఈ దాడిలో తన డ్రైవర్కు గాయాలైనాయని, ప్రాణాలు కూడా పోయుండేవని అన్నారు. అలాంటి సమయంలో కారు అదుపుతప్పి రైతులుగా చెప్పుకుంటున్న ఇద్దరు వ్యక్తులను గాయపరిచినట్లు ఆశిష్ వివరించారు.
భారతీయ రైతులు అలాంటి వారు కాదని, ఎవరిపై పడితే వారిపై దాడులకు దిగరని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇదంతా రైతులను ముందుండి నడిపిస్తున్న వారి తప్పని విమర్శించారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా గళమెత్తవచ్చని, కానీ శాంతంగానే నిరసనలు చేయాలని సూచించారు. కాగా, ఈ ఘటన తర్వాత ప్రమాదంలో మరణించిన వారికి, గాయపడిన వారికి భారీగా నష్టపరిమారాన్న ఇస్తామని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది.