Lakhimpur Kheri | ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్ ఖేరీలో రైతులపైకి కారు నడిపిన కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. రైతులపై కాల్పులు జరిపింది కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా తనయుడు ఆశీష్ మిశ్రా అని తేలింది. మంగళవారం ఫోరెన్సిక్స్ సైన్స్ ల్యాబ్ (ఎఫ్ఎస్ఎల్) నివేదిక బయటకు వచ్చింది. గత నెల మూడో తేదీన జరిగిన ఘటనలో ఆశీష్ మిశ్రాతోపాటు అంకిత్ దాస్ కూడా కాల్పులు జరిపారని ఎఫ్ఎస్ఎల్ నివేదిక స్పష్టం చేసింది.
రైతులు నిరసన తెలుపుతున్న ప్రాంతంలో జరిగిన కాల్పుల నివేదికలు పరిశీలించగా, ఆశీష్ మిశ్రా లైసెన్స్డ్ తుపాకీ నుంచే ఈ బుల్లెట్లు వచ్చాయని వివరించింది. ఈ కేసులో కేంద్ర మంత్రి తనయుడు ఆశీష్ మిశ్రా ప్రధాన నిందితుడిగా ఉన్నారు. తాజాగా ఎఫ్ఎస్ఎల్ నివేదికలో ఆశీష్ మిశ్రాపై ఆరోపణలు రావడంతో కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా ఇబ్బందుల్లో చిక్కుకున్నారు. ఇప్పటి వరకు తన తనయుడ్ని నిందితుల జాబితా నుంచి తప్పించడానికి అజయ్ మిశ్రా ప్రయత్నించారని ఆరోపణలు ఉన్నాయి. దీనికి ఎఫ్ఎస్ఎల్ నివేదికతో పెద్ద ఎదురు దెబ్బ తగిలినట్లయింది.
అసలు ఆశీష్ మిశ్రా కారు నడుపలేదని, అక్కడ ఆశీష్ మిశ్రా ఆ వాహనంలోనే లేరని నిరూపించడానికి చేసిన ప్రయత్నాలు విఫలం అయ్యాయి. గత నెలలో యూపీ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య పర్యటన నేపథ్యంలో కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా లఖీంపూర్ ఖేరిలో వందల మంది రైతులు నిరసనకు దిగారు. అప్పుడు ఆ మార్గంలో వెళుతున్న కేంద్రమంత్రి అజయ్ మిశ్రా తనయుడు ఆశీష్ మిశ్రా కాన్వాయ్.. రైతుల మీదుగా దూసుకెళ్లింది. దీంతో నలుగురు రైతులు, ఒక జర్నలిస్టుతోపాటు ఎనిమిది మంది మృతి చెందారు.