Laila Khan’s Murder Case | మహారాష్ట్ర రాజధాని ముంబైలో బాలీవుడ్ నటి లైలాఖాన్, ఆమె కుటుంబసభ్యుల దారుణ హత్య కేసులో కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసులో దోషిగా తేలిన లైలా ఖాన్ సవతి తండ్రి పర్వేజ్ తక్కు అదనపు సెషన్స్ జడ్జి సచిన్ పవార్ మరణశిక్ష విధించారు.
2011లో నటి లైలాఖాన్తోపాటు ఆమె తల్లి సెలీనా, ముగ్గురు చెల్లెళ్లు, తమ్ముడు ముంబైలోని లైలాఖాన్ నివాసంలోనే దారుణ హత్యకు గురయ్యారు. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు వ్యక్తులు హత్యకు గురికావడం అప్పట్లో ముంబైలో సంచలనంగా మారింది. లైలాఖాన్ ఆస్తుల మీద కన్నేసిన పర్వేజ్ తక్ తన స్నేహితుడు షకీర్ వాణితో కలిసి ఆమె కుటుంబాన్ని అంతం చేయాలని పథకం వేశాడు.
కశ్మీరి అయిన హంతకుడు పర్వేజ్ తక్.. లైలాఖాన్ తల్లి సెలీనాకు మూడో భర్త. పథకం ప్రకారం పర్వేజ్.. షకీర్ వాణి సహకారంతో లైలాఖాన్ బంగ్లాలోనే మారణకాండ సాగించారు. ముందుగా భార్య సెలీనాను హత్య చేశాడు. అనంతరం లైలాఖాన్ను ఆమె ముగ్గురు చెల్లెళ్లను, తమ్ముడిని ఒకరికి తెలియకుండా ఒకరిని చంపేశాడు. అనంతరం ఇంటికి తాళం వేసి ఏమీ ఎరుగనట్టుగా షకీర్తోపాటు లైలాఖాన్ కార్లలోనే కశ్మీర్కు పారిపోయాడు.
అయితే లైలాఖాన్, ఆమె కుటుంబసభ్యులు నెలల తరబడి కనిపించకపోవడం, ఇంటికి తాళం వేసి ఉండటంతో పర్వేజ్ ఖాన్ను అనుమానించిన పోలీసులు.. జమ్ముకశ్మీర్లో అతడిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో హత్యల విషయం బయటికి వచ్చింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు హత్యలు జరిగిన బంగళా నుంచి పూర్తిగా కుళ్లిపోయిన మృతదేహాలను వెలికి తీశారు.
దాదాపు 13 ఏళ్లుగా ఈ హత్యల కేసు విచారణ సాగిందని ప్రభుత్వ న్యాయవాది ఉజ్వల్ నికమ్ చెప్పారు. ఈ నెల 9న సెషన్స్ జడ్జి సచిన్ పవార్ పర్వేజ్ను దోషిగా తేల్చారని, ఇవాళ హంతకుడికి మరణశిక్ష ఖరారు చేశారని తెలిపారు.