లేహ్: బీజేపీ సీనియర్ నేత కుమారుడు, బౌద్ధ మతానికి చెందిన ఒక మహిళతో కలిసి పారిపోయాడు. ఆ తర్వాత ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో ఆ బీజేపీ నేతను పార్టీ నుంచి బహిష్కరించారు (BJP Veteran Expelled). కేంద్రపాలిత ప్రాంతమైన లడఖ్లో ఈ సంఘటన జరిగింది. 74 ఏండ్ల నజీర్ అహ్మద్, లడఖ్ బీజేపీ ఉపాధ్యక్షుడు. నెల రోజుల కిందట అతడి కుమారుడైన 39 ఏండ్ల మంజూర్ అహ్మద్, బౌద్ధ మతానికి చెందిన 35 ఏండ్ల మహిళతో కలిసి పారిపోయాడు. అనంతరం వారిద్దరూ కోర్టులో పెళ్లి చేసుకున్నారు.
కాగా, ఈ సంఘటనపై బీజేపీ తీవ్రంగా స్పందించింది. కుమారుడు చేసిన తప్పునకు తండ్రిపై వేటు వేసింది.
నజీర్ అహ్మద్ను పార్టీ నుంచి బహిష్కరించింది. బుధవారం బీజేపీ కార్యవర్గ సమావేశం అనంతరం లడఖ్ బీజేపీ చీఫ్ ఫుంచోక్ స్టాంజిన్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ముస్లిం వ్యక్తి, బౌద్ధ మహిళ కలిసి పారిపోవడాన్ని లడఖ్లోని అన్ని మతాల వారు అంగీకరించరని అందులో తెలిపారు. అలాగే లడఖ్లో మత సామరస్యం, ప్రజల మధ్య ఐక్యతకు ఈ చర్య విఘాతం కలిగించిందన్నారు. బౌద్ధ మహిళతో కుమారుడు పారిపోవడం గురించి స్పష్టత ఇవ్వాలని నజీర్ అహ్మద్ను పార్టీ వివరణ కోరిందని, ఆయన స్పందించకపోవడంతో బీజేపీ నుంచి బహిష్కరించినట్లు ఆ లేఖలో పేర్కొన్నారు.
మరోవైపు బీజేపీ నుంచి తనను బహిష్కరించడాన్ని నజీర్ అహ్మద్ తప్పుపట్టారు. నెల కిందట తాను హజ్ యాత్రలో ఉన్నప్పుడు తన కుమారుడు, బౌద్ధ మహిళ కోర్టులో పెళ్లి చేసుకున్నారని తెలిపారు. వారిద్దరికీ ఎప్పటి నుంచో పరిచయం ఉందని, 2011లోనే వారు పెళ్లి చేసుకున్నారని చెప్పారు. అయితే కుమారుడి ఆచూకీ కోసం తాను ఎంతో ప్రయత్నించానని, వారిద్దరూ ఎక్కడ ఉన్నారో తనకు తెలియదన్నారు. ఈ పెళ్లిని తన కుటుంబం కూడా వ్యతిరేకించిందని చెప్పారు. అయినప్పటికీ తన కుమారుడు చేసిన తప్పునకు తనను బీజేపీ నుంచి బహిష్కరించారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి ముందు పార్టీకి రాజీనామా చేయాలని తనను బలవంతం చేసినట్టు ఆయన ఆరోపించారు.