ముంబై : కరోనా వ్యాక్సిన్ల కొరతతో మహారాష్ట్రలో 45 ఏండ్లు దాటిన వారిలో కేవలం 50 శాతం మందికి మాత్రమే ఇప్పటివరకూ కొవిడ్-19 వ్యాక్సిన్ తొలిడోసు ఇవ్వగలిగారు. మహారాష్ట్రలో నమోదైన కరోనా మరణాల్లో 45 ఏండ్లు పైబడిన వారు 58 శాతం మంది ఉన్నారని నివేదికలు వెల్లడిస్తున్నక్రమంలో వ్యాక్సినేషన్ రేటు మందకొడిగా ఉండటం ఆందోళన రేకెత్తిస్తోంది.
ఆగస్ట్ నాటికి 45 ఏండ్లు పైబడిన వారిలో 70 శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేయాలన్న లక్ష్యం కూడా టీకాల కొరతతో నెరవేరలేదు. ఇక ఈ ఏజ్ గ్రూప్లో కేవలం 25.6 శాతం మందికి మాత్రమే వ్యాక్సిన్ రెండు డోసులు పూర్తయ్యాయి. 45 ఏండ్లు పైబడిన వారికి వ్యాక్సినేషన్ కార్యక్రమం ఈ ఏడాది మార్చిలో ప్రారంభం కాగా టీకాల కొరత వేధిస్తోంది. మరోవైపు జిల్లాల వారీగా వ్యాక్సినేషన్ రేటులో వ్యత్యాసాలు కూడా ఆందోళన కలిగిస్తున్నాయి.
కొన్ని జిల్లాల్లో మూడు నెలల నుంచి టీకాలు నిండుకున్నాయని అప్పటి నుంచి పలుమార్లు టీకాల సరఫరా చేయాలని ప్రభుత్వానికి పలుమార్లు లేఖలు రాసినా ఎలాంటి ఫలితం లేదని అధికారులు పేర్కొంటున్నారు. కరోనా తదుపరి వేవ్లను అధిగమించాలంటే వ్యాక్సినేషన్ ప్రక్రియను ముమ్మరంగా చేపట్టాల్సి ఉందని చెబుతున్నారు.