బెంగళూరు : స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ (ఎస్ఎస్సీ) పరీక్షలను ఇంగ్లీష్, హిందీలో నిర్వహించేందుకు నోటిఫికేషన్ జారీ అయిన క్రమంలో ప్రాంతీయ భాషలను అణగదొక్కేందుకు బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని జేడీ(యూ) నేత, కర్నాటక మాజీ సీఎం కుమారస్వామి ఆరోపించారు.
ఎస్ఎస్సీ ఉద్యోగాలు ఇంగ్లీష్, హిందీ తెలిసిన వారికే ఇస్తారా..ప్రాంతీయ భాషలకు ఆప్షన్ ఇవ్వలేదు..ఇది హిందీని బలవంతంగా రుద్దడం కాక మరేమిటని మోదీ సర్కార్ను నిలదీస్తూ కుమారస్వామి ట్వీట్ చేశారు. దక్షిణాదిలోకి హిందీని చొప్పించడం కోసమే ఇంగ్లీష్, హిందీలోనే పరీక్షల నిర్వహణ చేపట్టారని అన్నారు.
పరీక్షలను కన్నడలో నిర్వహించాలని, కర్నాటక ఉద్యోగాలు కన్నడిగులకేనని ఆయన డిమాండ్ చేశారు. ఇక కుమారస్వామి విమర్శలను బీజేపీ తోసిపుచ్చింది. 1975 నుంచి ఎస్ఎస్సీ పరీక్షలను ఇంగ్లీష్, హిందీలో నిర్వహిస్తున్నారని, అప్పుడు తమ పార్టీ అధికారంలో లేదని బీజేపీ నేత బీసీ నాగేష్ పేర్కొన్నారు. 1996లో దేవెగౌడ ప్రధానిగా ఉన్న సమయంలోనూ ఇలాగే నిర్వహించారని ఈ అంశాన్ని వివాదాస్పదం చేయడం సరైంది కాదని అన్నారు.