హైదరాబాద్: భారతదేశంలోని ప్రధాన ఆధ్యాత్మిక సంస్థలలో ఒకటి అయిన యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా, వై.ఎస్.ఎస్. ను ప్రముఖ ఆధ్యాత్మిక గురువు ఒక యోగి ఆత్మకథ రచయిత పరమహంస యోగానంద మార్చి 22,1917న స్థాపించారు. సామాన్య జనబాహుళ్యానికి భారతదేశపు ఆధ్యాత్మిక బోధనలను వ్యాపింపజేసి, భగవంతుడితో వారికి గల అనుబంధాన్ని గాఢతరం చేసుకునేందుకు సత్యాన్వేషకులను సమర్థులుగా చేయడంలో మాత్రమే కాక, దేశవ్యాప్తంగా అనేక ధార్మిక ప్రణాళికలలోనూ కార్యక్రమాల్లోనూ నేరుగా సహకరిస్తూ వై.ఎస్.ఎస్. ఒక వినూత్నమైన మెచ్చుకోదగిన పాత్రను పోషించింది.
శరీరం, మనస్సు, ఆత్మల మధ్య సమతుల్యతను నిలబెట్టుకుంటూ సామరస్యంగా జీవించడమనే మార్గానికి యోగానంద “యోగదా” పద్ధతి అని పిలిచేవారు. దీని ద్వారా యువతకు శిక్షణ ఇవ్వడమనే బృహత్కార్యాన్ని చేపట్టినప్పుడు యోగానంద ఒక యువ సన్యాసి మాత్రమే. ఆయన ప్రస్తుతం పశ్చిమ బెంగాలులో ఉన్న దిహికా గ్రామంలో అతి కొద్దిమంది విద్యార్థులతో ఒక పాఠశాలను 1917లో ప్రారంభించారు. వై.ఎస్.ఎస్. కు సహసంస్థ అయిన సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్ ను ఆయన అమెరికాను చేరిన తర్వాత 1920లో స్థాపించారు. ఎస్.ఆర్.ఎఫ్. కు ప్రపంచవ్యాప్తంగా ధ్యాన కేంద్రాలు ఉన్నాయి.
రాంచీ, దక్షిణేశ్వర్, ద్వారహాట్, నోయిడాలో ఉన్న వై.ఎస్.ఎస్. ఆశ్రమాలలో అనేకమంది సన్యాసులు, స్వచ్ఛంద సేవకులు నివసిస్తున్నారు, వారు వై.ఎస్.ఎస్. కార్యక్రమాలను నిర్వహించడం, ఆధ్యాత్మిక కార్యక్రమాలను, సత్సంగాలను జరిపించడం, భక్తులకు సలహాలు ఇవ్వడం, ఇంట్లో చదువుకునే పాఠాలను, సాహిత్యాన్ని పంపిణీ చేయడం, అవసరమైనప్పుడు సహాయ కార్యక్రమాలను నిర్వహించడం, యోగానంద బోధనలను ముందుకు తీసుకెళ్ళడానికి తోడ్పడే అనేక ఇతర కార్యక్రమాలను చేపట్టడం, ఇవన్నీ చేస్తూ మహా గురువుల సంస్థకు ప్రతినిధులుగా సేవలందిస్తున్నారు.