మథుర, ఫిబ్రవరి 6: మథురలోని శ్రీకృష్ణ జన్మభూమి కాంప్లెక్స్లో ఒక ఆలయాన్ని మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు ధ్వంసం చేసి, దానిపై మసీదు నిర్మించాడని 1920 నాటి బ్రిటిష్ ప్రభుత్వ గెజిట్ రికార్డులు చెబుతున్నాయని ఆగ్రా పురావస్తు శాఖ ఒక ఆర్టీఐ సమాధానంలో వెల్లడించింది. అయితే ఏఎస్ఐ తన సమాధానంలో ‘శ్రీకృష్ణ జన్మభూమి’ అనే పదాన్ని ప్రత్యేకంగా పేర్కొనలేదు. అంతకుముందు ఉన్న కేశవ్దేవ్ ఆలయాన్ని ఔరంగజేబు కూల్చి మసీదు నిర్మించాడని మాత్రమే ఏఎస్ఐ పత్రాలు పేర్కొన్నాయి.
ఈ మేరకు కేశవ్దేవ్ ఆలయం కూల్చివేత కు సంబంధించిన వివరాలు కోరుతూ మొయిన్పురికి చెందిన అజయ్ ప్రతాప్ సింగ్ అనే వ్యక్తి సమాచార హక్కు చట్టం కింద చేసిన దరఖాస్తుకు ఏఎస్ఐ ఇచ్చిన సమాధానం తాజాగా సంచలనంగా మారింది.ఈ ఆధారాన్ని సుప్రీంకోర్టు, అలహాబాద్ హైకోర్టుల్లో సాక్ష్యంగా చూపెడతామని శ్రీకృష్ణ జన్మభూమి-షాహీ ఈద్గా వివాదం కేసులో హిందువుల తరపున వాదిస్తున్న న్యాయవాది సింగ్ తెలిపారు. ఈ కేసు విచారణను అలహాబాద్ హైకోర్టు ఈ నెల 22కు షెడ్యూల్ చేసింది.