కోల్కతా, మార్చి 21: పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) మధ్య యుద్ధం నడుస్తున్నది. నిరుటి ఓ ఆడియో టేప్ లీకు వ్యవహారంలో బెంగాల్ పోలీసులు సోమవారం ఈడీలోని ముగ్గురు సీనియర్ అధికారులకు సమన్లు పంపించారు. దర్యాప్తునకు హాజరు కావాలని ఆదేశించారు. మనీ ల్యాండరింగ్ కేసులో సీఎం మమత మేనల్లుడు అభిషేక్ బెనర్జీ ఈడీ ముందు హాజరుకావాల్సిన రోజే ఈడీ అధికారులకు సమన్లు వెళ్లడం గమనార్హం. అభిషేక్పై ఈడీ చర్యకు కౌంటర్గానే బెంగాల్ పోలీసులు ఈడీ అధికారులకు సమన్లు పంపినట్టు భావిస్తున్నారు. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కోల్కతాలో ఓ వ్యాపారిపై నమోదైన కేసులో ఆడియో టేపు బయటకు వచ్చింది. అందులో సదరు వ్యాపారి పశువుల స్మగ్లింగ్, బొగ్గు కుంభకోణం గురించి ఈడీ అధికారులతో చర్చించారు. దీనిపై పోయినేడాది సెప్టెంబర్లోనే పోలీసులు ఈడీ అధికారులకు సమన్లు పంపారు. సమన్లపై ఢిల్లీ హైకోర్టు స్టే విధించింది. పోలీసుల దర్యాప్తునకు అనుమతించింది. ఈ కేసులోనే పోలీసులు తాజాగా మళ్లీ సమన్లు పంపారు. అభిషేక్ బెనర్జీ సోమవారం ఢిల్లీలో ఈడీ అధికారుల ముందు హాజరయ్యారు. గతంలో సమన్లను వ్యతిరేకిస్తూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించగా వీరి పిటిషన్ను కోర్టు కొట్టేసింది. ఈ నేపథ్యంలోనే ఈడీ ఇటీవలే అభిషేక్, రుజిరాలకు మళ్లీ సమన్లు జారీచేసింది.