Kolkata Case | కోల్కతాకు చెందిన వైద్యురాలిపై అత్యాచారం, హత్య కేసు ఘటనపై సుప్రీంకోర్టు సోమవారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా సీబీఐ కేసు దర్యాప్తునకు సంబంధించిన స్టేటస్ రిపోర్ట్ను సమర్పించింది. అదే సమయంలో బెంగాల్ ప్రభుత్వం సైతం రిపోర్టును సైతం కోర్టుకు సమర్పించింది. వైద్యులు విధులకు హాజరుకాకపోవడంతో 23 మంది ప్రాణాలు కోల్పోయారని బెంగాల్ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ తెలిపారు. ఆ తర్వాత సీబీఐ కొత్త స్టేటస్ రిపోర్టును సమర్పించాలని సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రా ధర్మాసనం ఆదేశించింది. విచారణను ఈ నెల 17వ తేదీకి వాయిదా వేసింది. అనంతరం విచారణ సందర్భంగా వైద్యులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కోర్టు ఆదేశించింది. విధులకు వచ్చిన వైద్యులపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని స్పష్టం చేసింది. అయితే, ఇంకా వైద్యులు మంగళవారం సాయంత్రం 5గంటల్లోగా విధులకు హాజరుకావాలని చెప్పింది.
నిరంతరాయంగా విధులకు గైర్హాజరయితే వారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవచ్చని చెప్పింది. కేసు విచారణ సందర్భంగా సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను ఆర్జీ మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపాల్ నివాసం, ఆసుపత్రికి మధ్య దూరాన్ని సీజేఐ అడిగి తెలుసుకున్నారు. దీనికి మెహతా స్పందిస్తూ సుమారు 15 నుంచి 20 నిమిషాల ప్రయాణం ఉంటుందని చెప్పారు. వైద్యురాలు మనందరికీ కూతురులాంటిదని.. ఈ కేసులో దోషులను వీలైనంత త్వరగా శిక్షించాలని సొలిసిటర్ జనరల్ కోరారు. విచారణ సందర్భంగా అసహజ మరణ రిపోర్ట్ను దాఖలు చేసే సమయంపై సుప్రీంకోర్టు వివరణ కోరింది. ఈ సందర్భంగా సీసీటీవీ ఫుటేజీ, సీబీఐకి అందించిన ఆధారాలపై సైతం ధర్మాసనం వివరాలు అడిగి తెలుసుకున్నది. కోల్కతా ప్రభుత్వం ఇచ్చిన నమూనాలను ఎయిమ్స్, ఇతర కేంద్ర ఫోరెన్సిక్ ల్యాబొరేటరీలకు పంపాలని సీబీఐ నిర్ణయించిందని ఎస్జీ మెహతా ధర్మాసనానికి తెలిపారు. పోర్టుమార్టం నివేదికపై మరో న్యాయవాది ప్రశ్నలు లేవనెత్తారు. వెజినల్ స్వాబ్ నాలుగు డిగ్రీల సెల్సియస్ వద్ద భద్రపరచాలని.. కానీ అలా చేయలేదన్నారు.
పోస్టుమార్టం రిపోర్టులో ఎప్పుడు పోస్టుమార్టం చేశారన్న ప్రస్తావన లేదని సొలిసిటర్ జనరల్ చెప్పారు. అత్యాచారం, హత్య కేసులో మొదటి ఐదుగంటలు కీలకమని ఎస్జీ మెహతా పేర్కొన్నారు. ఘటన జరిగిన ఐదురోజుల తర్వాత విచారణ చేపట్టిన సీబీఐకి ఎన్నో సవాళ్లు ఉన్నాయన్నారు. ఈ క్రమంలో దర్యాప్తుపై కొత్త స్టేటస్ రిపోర్ట్ను సమర్పించాలని సీబీఐ కోర్టును ఆదేశించింది. ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలో మోహరించిన భద్రతా సిబ్బందికి సంబంధించిన సమస్యను ఎస్జీ తుషార్ మెహతా లేవనెత్తారు. సీఐఎస్ఎస్ఎఫ్కు చెందిన మూడు కంపెనీలకు వసతి కల్పించాలని బెంగాల్ హోంశా సీనియర్ అధికారి, సీఐఎస్ఎఫ్ సీనియర్ అధికారిని ధర్మాసనం ఆదేశించింది. ఇవాళ రాత్రి 9 గంటలకు సీఐఎస్ఎఫ్ సిబ్బందికి అవసరమైన అన్ని వనరులను సమకూర్చాలని స్పష్టం చేసింది. అయితే, ఐకార్డ్ లేకుండా ఎమర్జెన్సీ వార్డులోకి ప్రవేశించేందుకు ఎవరినీ అనుమతించొద్దని ఆదేశించడంతోపాటు వైద్యుల భద్రతకు అవసరమైన చర్యలు తీసుకోవాలని చెప్పింది. సోషల్ మీడియా నుంచి బాధితురాలి చిత్రాలన్నింటినీ వెంటనే తొలగించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.