పాట్నా: అనారోగ్య సమస్యతో ప్రైవేట్ ఆసుపత్రిలో చేరిన ఒక మహిళ శరీరంలోని రెండు కిడ్నీలను చోరీ చేశారు. ఆమె ఆరోగ్యం విషమించడంతో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా ఈ విషయం బయటపడింది. దీంతో సర్జరీ చేసిన డాక్టర్ కిడ్నీని తనకు మార్పిడి చేయాలని ఆ మహిళ డిమాండ్ చేసింది. బీహార్లోని ముజఫర్పూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. 38 ఏళ్ల సునితా దేవి అనే మహిళ, గర్భాశయం తొలగింపు కోసం సెప్టెంబర్ 3న బరియార్పూర్ గ్రామంలోని శుభకాంత్ క్లినిక్కు వెళ్లింది. అయితే ఆ ఆసుపత్రిలో సర్జరీ చేసిన వైద్యులు గర్భాశయం బదులుగా ఆమె రెండు కిడ్నీలను అక్రమంగా తొలగించి చోరీ చేశారు.
కాగా, సునీతా దేవి ఆరోగ్యం విషమించడంతో కుటుంబ సభ్యులు ఆమెను ముజఫర్పూర్లోని శ్రీ కృష్ణ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్కు తరలించారు. పరిశీలించిన వైద్యులు ఆమె రెండు కిడ్నీలను తొలగించి చోరి చేసినట్లు తెలిసి షాకయ్యారు. ఆమెకు నిరంతరం డయాలసిస్ చేకపోతే బతకడం కష్టమని చెప్పారు. మెరుగైన వైద్యం కోసం పాట్నాలోని గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్కు రిఫర్ చేశారు. అక్కడ ఆమెకు మెరుగైన చికిత్స అందించి తిరిగి ఎస్కేఎంసీహెచ్కు పంపారు.
మరోవైపు రెండు కిడ్నీలు తొలగించి చోరీ చేసిన వైద్యుడి కిడ్నీని తనకు మార్పిడి చేయాలని సునితా దేవి డిమాండ్ చేసింది. కాగా, ఆమె కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో శుభకాంత్ క్లినిక్ యజమాని పవన్ కుమార్, డాక్టర్ ఆర్కె సింగ్పై పోలీసులు కేసు నమోదు చేశారు. నాటి నుంచి పరారీలో ఉన్న నిందితుల కోసం వెతుకుతున్నట్లు తెలిపారు. అది రిజిస్టర్ క్లినిక్ కాదని, వైద్యుడి విద్యార్హత ధ్రువీకరణ పత్రాలు నకిలీవని పోలీసులు వెల్లడించారు.