న్యూఢిల్లీ: కెనడాకు చెందిన ఖలిస్తానీ ఉగ్రవాది హర్షదీప్ డల్లా(Arshdeep Dalla)కు.. పాకిస్థాన్కు చెందిన లష్కరే తోయిబా ఉగ్ర సంస్థతో లింకులు ఉన్నట్లు తెలుస్తోంది. పంజాబ్లో ఉన్న హిందూ నేతల్ని ఆ ఉగ్రవాది టార్గెట్ చేసినట్లు ఢిల్లీ పోలీసులు భావిస్తున్నారు. ఖలిస్తానీ ఉగ్రవాది హరదీప్ సింగ్ నిజ్జార్ హత్య కేసులో ఇండియా, కెనడా మధ్య మాటల యుద్ధం నడుస్తున్న విషయం తెలిసిందే. నిజ్జార్ హత్య వెనుక భారత్ హస్తం ఉన్నట్లు ట్రూడో ఆరోపణలు చేశారు. ఆ ఆరోపణలను భారత్ ఖండించింది. రెండు దేశాలు తమ దౌత్యవేత్తలను వెలివేశాయి కూడా.
జగ్జీత్ సింగ్ జగ్గాతో డల్లాకు సంబంధాలు ఉన్నట్లు ఢిల్లీ పోలీసులు తమ ఛార్జిషీట్లో తెలిపారు. పంజాబ్లో ఉగ్ర దాడులకు ప్రిపేర్ కావాలని జగ్గాను డల్లా ఆదేశించినట్లు ఆ ఛార్జిషీట్లో పేర్కొన్నారు. లష్కరే ఉగ్రవాది సుహేల్తోనూ డల్లా టచ్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఢిల్లీలోని జహంగిర్పురిలో జరిగిన ఓ హిందూ కుర్రాడి హత్య కేసులో ఆ ఇద్దరూ నిందితులుగా ఉన్నారు. ఆర్ఎస్ఎస్ నేతల్ని హత్య చేయాలని హర్షదీప్ డల్లా.. జగ్గాను ఆదేశించినట్లు పోలీసులు విచారణలో తేల్చారు.
27 ఏళ్ల డల్లాది పంజాబ్లోని మోఘా జిల్లా. అతనిపై 25 కేసులు ఉన్నాయి. మర్డర్, కుట్ర, అక్రమ ఆయుధాల కేసులు అతనిపై ఉన్నాయి. సాధువులు, మతపరమైన నేతల్ని హత్య చేయాలని డల్లా ఆదేశాలు ఇచ్చినట్లు పోలీసులు తమ రిపోర్టులో తెలిపారు.