చండీగఢ్: పంజాబ్లోని ఒక పార్క్ గోడపై ‘ఖలిస్తాన్ జిందాబాద్’ నినాదం కనిపించడం కలకలం రేపింది. వెంటనే స్పందించిన మున్సిపల్ సిబ్బంది దానిపై పెయింట్ వేసి కనిపించకుండా చేశారు. విషయం తెలిసిన పోలీసులు దీనిపై దర్యాప్తు చేపట్టారు. ఫరీద్కోట్లో శుక్రవారం ఈ ఘటన జరిగింది. ఒక పార్క్ గోడపై ‘ఖలిస్తాన్ జిందాబాద్’ అని రాసి ఉండటం స్థానికంగా కలకలం రేపింది. మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు వెంటనే దీనిపై స్పందించారు. దానిపై రంగు వేసి కనిపించకుండా చేశారు.
మరోవైపు ఈ విషయం తెలిసిన పోలీసులు ఆ పార్క్ వద్దకు చేరుకున్నారు. పార్కు గోడపై ‘ఖలిస్తాన్ జిందాబాద్’ అని రాసిన వారిని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. దీని కోసం ఆ ప్రాంతంలోని సీసీటీవీల ఫుటేజ్ను పరిశీలిస్తున్నారు. అలాగే ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చెక్ పోస్టుల వద్ద పోలీస్ తనిఖీలను కూడా ముమ్మరం చేశారు.
కాగా, ఈ నెల 8న హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ప్రధాన గేట్ వద్ద ఖలిస్తాన్ జెండాలను ఎగురవేసిన ఘటనకు సంబంధించిన ఇద్దరు నిందితుల్లో ఒకరిని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) బుధవారం అరెస్ట్ చేసింది. పంజాబ్లోని మొరిండాలోని ఒక ఇంట్లో ఉన్న 30 ఏళ్ల హర్బీర్ సింగ్, అలియాస్ రాజును అదుపులోకి తీసుకున్నారు. అలాగే రూప్నగర్ జిల్లాలోని పరమజిత్ సింగ్ ఇంటిపై కూడా సిట్ దాడి చేసింది. అయితే ఆ వ్యక్తి అక్కడ లేకపోవడంతో అరెస్ట్ చేయలేకపోయింది.